దమ్మపేట రూరల్: నెల రోజులుగా తాగునీటి సరఫరా లేకపోవడంతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలంలోని మొద్దులగూడెం ఎస్సీ కాలనీ వాసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సీపీఎం ఆధ్వర్యంలో ఆదివారం రాస్తారోకో నిర్వహించారు.
కాలనీలో తాగునీటి మోటార్ కాలిపోవడంతో దాన్ని బోరు నుంచి బయటకు తీసేందుకు ప్రయత్నించగా బోరులోనే ఇరుక్కుపోయిందని గ్రామస్తులు తెలిపారు. కొత్త బోరు వేస్తామని గ్రామ పంచాయతీ కార్యదర్శి చెప్పారని పేర్కొన్నారు.
నెల రోజులుగా తాగునీటి కోసం సమీపంలోని పామాయిల్ తోటల్లోని డ్రిప్ పైపుల వద్ద నుంచి నీటిని తెచ్చుకుంటున్నామని సీపీఎం దమ్మపేట మండల కార్యదర్శి మోరంపూడి శ్రీనివాసరావు అన్నారు. వర్షాలు పడినప్పుడు మోటార్లను ఆపివేస్తున్నారని, మోటార్లు పనిచేయని సమయంలో తాగునీరు లేక ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు.
పంచాయతీ కార్యదర్శి ‘ఇవాళ.. రేపు’ అంటూ కాలం వెళ్లదీస్తున్నారని సీపీఎం జిల్లా నాయకుడు దొడ్డా లక్ష్మీనారాయణ అన్నారు. తక్షణమే తాగునీటి సరఫరాను ప్రారంభించాలని డిమాండ్ చేశారు.