దమ్మపేట: దమ్మపేట మండల పరిధిలోని గండుగులపల్లిలో మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు నివాసంలో తుమ్మలను ప్రభుత్వ విప్, పినపాక ఎమ్మెల్యే, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు, జడ్పీ చైర్మన్ కోరం కనకయ్య, ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావులు సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా తుమ్మల తొలిసారిగా జిల్లా అధ్యక్షుని హోదాలో తన వద్దకు వచ్చినందుకు రేగా కాంతారావుతో పాటు జడ్పీ చైర్మన్ కోరం కనకయ్య, ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావులను శాలువాలతో ఘనంగా సత్కరించారు.
అనంతరం తుమ్మలతో కాసేపు ముచ్చటించారు. తుమ్మలను కలిసిన వారిలో జడ్పీటీసీ పైడి వెంకటేశ్వరరావు, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు దొడ్డాకుల రాజేశ్వరరావు, పామాయిల్ రైతుసంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఆలపాటి రామచంద్రప్రసాద్, నియోజకవర్గ నాయకులు జారె ఆదినారాయణ, ఏఎంసీ వైస్ చైర్మన్ కొయ్యల అచ్యుతరావు, కాసాని నాగప్రసాద్, ఎర్రా వసంతరావు తదితరులు ఉన్నారు.