రామవరం, జూన్ 11 : తెలంగాణ రాష్ట్రంలోని మైనారిటీ గురుకుల విద్యాసంస్థల్లో పనిచేస్తున్న టీచింగ్, నాన్ టీచింగ్ ఉద్యోగుల వేతనాలను వెంటనే విడుదల చెయ్యాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మైనారిటీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఎండీ.యాకూబ్ పాషా బుధవారం ఒక ప్రకటనలో ప్రభుత్వాన్ని కోరారు. రాష్ట్ర వ్యాప్తంగా గల 204 మైనారిటీ పాఠశాలలు, 204 కళాశాలల్లో పనిచేస్తున్న వందలాది మంది ఔట్ సోర్సింగ్, టీచింగ్ – నాన్ టీచింగ్, నాన్ సాంక్షన్ ఉద్యోగులకు గత రెండు నెలలుగా ప్రభుత్వం వేతనాలు చెల్లించని కారణంగా ఆర్థిక ఇబ్బందులకు గురి అవుతున్నట్లు వెల్లడించారు.
ఈ నెలలో జరిగిన ఈద్ ఉల్ ఆదా(బక్రీద్) పండుగ కూడా జరుపుకోలేక పస్తులు ఉండే పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. చాలీచాలని వేతనాలతో దుర్భర జీవితం గడుపుతున్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల జీతభత్యాలు సక్రమంగా చెల్లించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం అవుతుందన్నారు. ప్రభుత్వం మైనారిటీ గురుకులాల్లో పనిచేస్తున్న ఉద్యోగుల పట్ల నిర్లక్ష్య వైఖరి విడనాడి గత 2 నెలల నుండి పెండింగ్ లో ఉన్న వేతనాలను వెంటనే విడుదల చేయడంతో పాటు ప్రతీ నెల క్రమంగా వేతనాలు చెల్లించాలని పేర్కొన్నారు.