చర్ల, ఫిబ్రవరి 1: ఛత్తీస్గఢ్లోని పుజారి కాంకేర్ జిల్లా మావోయిస్టు పార్టీకి చెందిన ఓ ఆర్పీసీ మిలీషియా సభ్యురాలు మంగళవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల పోలీస్ స్టేషన్లో లొంగిపోయింది. సీఐ అశోక్ కథనం మేరకు.. ఛత్తీస్గఢ్లోని బీజాపూర్ జిల్లా పెద్ద ఉట్ల గ్రామానికి చెందిన తాతి చిలకను మూడేళ్ల క్రితం నూపా లక్ష్మా, కామయ్య, సహదేవ్ అనే మావోయిస్టు పార్టీ సభ్యులు బెదిరించి ఆర్పీసీ మిలీషియా సభ్యురాలిగా చేర్చారు.
మావోయిస్టు పార్టీ విధానాలు నచ్చక ఆమె జన జీవన స్రవంతిలో కలవాలని నిర్ణయించుకున్నదని, ఈ మేరకు పోలీస్ స్టేషన్లో లొంగిపోయిందన్నారు. సమావేశంలో ఎస్సైలు రాజువర్మ, వెంకటప్పయ్య, సీఆర్పీఎఫ్ 141 బెటాలియన్ అధికారులు పాల్గొన్నారు.