టేకులపల్లి, ఆగస్టు 22 : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలంలోని వెంకట్యాతండా సమీపంలో పోలీసులు భారీగా గంజాయిని పట్టుకున్నారు. కేసు వివరాలను ఇల్లెందు డీఎస్పీ చంద్రబాను శుక్రవారం వెల్లడించారు. గురువారం సాయంత్రం వెంకట్యాతండా సమీపంలో సీసీఎస్, టేకులపల్లి పోలీసులు సంయుక్తంగా వావాన తనిఖీలు చేపట్టారు. ఆ సమయంలో అటుగా వచ్చిన లారీ( RJ06GC0833 )ని చెక్ చేయగా అందులో 424.950 కేజీల గంజాయి లభించింది. దీని విలువ రూ.2 కోట్ల 12 లక్షల 47 వేలుగా తెలిపారు. నిందితులు గంజాయిని కొనుగోలు చేసి ఒడిశా నుంచి భద్రాచలం, పాల్వంచ మీదుగా రాజస్థాన్ తరలిస్తున్నట్లుగా సమాచారం.
నిందితుల్లో ప్రభులాల్ గుర్జర్, శివరాజ్ గుర్జర్ పట్టుబడ్డారు. రాంబాబు, నారాయణ గుర్జర్ పరారీలో ఉన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో టేకులపల్లి సీఐ బత్తుల సత్యనారాయణ, టేకులపల్లి ఎస్ఐ రాజేందర్, బోడ్ ఎస్ఐ శ్రీకాంత్, సీసీఎస్ సిబ్బంది, సీఐ రమాకాంత్, ఎస్సీ ప్రవీణ్ పాల్గొన్నారు.