– ఐటీసీ గేటు ఎదుట కుటుంబ సభ్యుల ఆందోళన
బూర్గంపహాడ్, ఏప్రిల్ 21 : బూర్గంపహాడ్ మండల పరిధిలోని సారపాక ఐటీసీ కర్మాగారంలో మంగళవారం లారీ ఫైర్ పైపులైనుకు తగలడంతో ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్ మెడకు తీవ్రగాయాలై మృతిచెందగా మరో ఇద్దరు ప్రమాదం నుండి బయటపడ్డారు. ఉదయం లక్ష్మీపురం గ్రామానికి చెందిన ఓ ట్రాన్స్పోర్టులో ముసలిమడుగుకు చెందిన తంబి(50) లారీ డ్రైవర్గా పని చేస్తున్నాడు. లారీలో పల్ప్ మెటీరియల్ తీసుకుని ఐటీసీలోని పల్ప్ యార్డులో అన్లోడింగ్ చేసుకుని తిరిగి బయటి వర్క్కు సంబంధించి వెళ్తుండగా లారీ యార్డు సమీపంలో ఉన్న ఫైర్ పైపులైనుకు లారీ బలంగా తగిలి పూర్తిగా మెల్ట్ అయింది. దీంతో ప్రధాన పైపు పగిలిపోవడంతో ఈ సంఘటనలో డ్రైవర్ కిందపడిపోవడంతో పైప్లైన్కు సంబంధించిన పైపు మెడభాగంలో తగలడంతో తెగిపోయింది.
సమాచారం అందుకున్న సెక్యూరిటీ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని అంబులెన్స్లో తీవ్రంగా గాయపడిన డ్రైవర్ తంబిని ఆస్పత్రికి తరలించే ప్రయత్నం చేశారు. అయితే భద్రాచలం వెళ్లే మార్గమధ్యంలో ప్రాణాలు కోల్పోయాడు. ఫైర్ పైపులైను పగిలిపోవడంతో ఉవ్వెత్తున నీరు ఎగిసిపడటంతో ఆ నీరంతా ఐటీసీ పక్కనే ఉన్న గోడ నుండి సారపాకలోని పలు వీధుల్లోకి వచ్చి చేరింది. అప్పటికే సెక్యూరిటీ సిబ్బంది అప్రమత్తమై ఫైర్ పైపులైను కనెక్షన్ ఆపడంతో ఎగిసిపడిన నీటి ఉధృతం తగ్గింది.
ఫైర్ పైపులైను పగలి ప్రమాదంలో మృతి చెందిన తంబి కుటుంబ సభ్యులు ఐటీసీ గేటు వద్ద మంగళవారం సాయంత్రం ఆందోళన నిర్వహించారు. తమ కుటుంబానికి ఐటీసీ యాజమాన్యం పరిహారం ఇచ్చి న్యాయం చేయాలని కోరారు. సమాచారం తెలుసుకున్న ఐటీసీ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని సంబంధిత కాంట్రాక్టర్ ద్వారా న్యాయం చేస్తామని చెప్పడంతో కుటుంబ సభ్యులు ఆందోళన విరమించారు.

ఐటీసీలో ప్రమాదం… లారీ డ్రైవర్ మృతి