ఖమ్మం రూరల్, ఫిబ్రవరి 05 : మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం సాయంత్రం పాలేరు మాజీ ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి, సిపిఎం జిల్లా కార్యదర్శి నున్న నాగేశ్వరరావుతో కలిసి నిర్వహించిన రోడ్ షో కు జన నీరాజనం పోటెత్తింది. 22, 23, 24వ డివిజన్ బీఆర్ఎస్ కూటమి అభ్యర్థులు గూడా సంజీవరెడ్డి, అడ్డాకుల శారద, సిపిఎం అభ్యర్థి శ్రీకాంత్ విజయాన్ని కాంక్షిస్తూ భారీ ర్యాలీ నిర్వహించారు. బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు బెల్లం వేణుగోపాల్ అధ్యక్షతన ఆయా డివిజన్లలో జరిగిన సభల్లో ఆయన మాట్లాడారు. బీఆర్ఎస్ కూటమికి ప్రజలు బ్రహ్మరథం పట్టడం సంతోషంగా ఉందన్నారు. ఏదులాపురం మున్సిపాలిటీ పాలకవర్గాన్ని బీఆర్ఎస్ కూటమి క్లీన్ స్వీప్ చేయబోతుందని ధీమా వ్యక్తం చేశారు. ఇంటి వ్యక్తులకు బయట వ్యక్తులకు తేడా గమనించాలని, ఇప్పటికే పాలేరు నియోజకవర్గం పరాయి వ్యక్తుల చేతికి వెళ్లిందన్నారు. బీఆర్ఎస్ తరఫున బరిలో ఉన్న అభ్యర్థులందరూ వార్డుకు ఆయా వార్డులకు సంబంధించిన అభ్యర్థులను పోటీలో నిలపడం జరిగిందన్నారు.
కాంగ్రెస్ నాయకులు ఆయా వార్డుల పరిధిలో ఓటర్లను బరిలో దింపకుండా డబ్బున్న కోటీశ్వరులకు టికెట్లు ఇచ్చారన్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఈ మున్సిపాలిటీని బీఆర్ఎస్ కైవసం చేసుకోబోతుందని, కాంగ్రెస్ ఎన్ని కుట్రలకు పాల్పడిన అంతిమ విజయం బీఆర్ఎస్ కూటమిదే అన్నారు. 23వ డివిజన్ సత్యనారాయణపురం వాసి అడ్డాకుల శారదకు గొప్ప మెజారిటీ అందించాలని, ఎన్నికైన తర్వాత శారద మరింత ఉన్నత స్థితిలో ఉండే విధంగా పార్టీ నిర్ణయం తీసుకోబోతుందన్నారు. ఐక్యతతో పనిచేసి కూటమి అభ్యర్థులకు ఘన విజయం సాధించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నేత తాళ్లూరు జీవన్ కుమార్, మాజీ జడ్పిటిసి ఎండపల్లి ప్రసాద్, నాయకులు ఏటుకూరి ప్రసాద్, తోట పెద్ద వెంకటరెడ్డి, కొట్టి నాగభూషణం పాల్గొన్నారు.