కర్ణాటక యాద్గిర్ జిల్లాలోని ఓ రసాయన పరిశ్రమలో జరిగిన ప్రమాదంలో తెలంగాణ యువకుడు సహ ముగ్గురు యువకులు మరణించారు. మరో ఇద్దరు తీవ్ర అస్వస్థతకు గురై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉందని అధికారులు తెలిపారు. విషవాయువులు విడుదల కావడం
బుధవారం తెల్లవారుజామున ఒంటి గంట నుంచి 2 గంటల మధ్యలో ఈ ప్రమాదం జరిగింది. ఫ్యాక్టరీలోని విషవాయువులు లీకవ్వడం వల్ల ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. విషవాయువులు లీకవ్వడంతో ఫ్యాక్టరీలో పనిచేస్తున్న ఐదుగురు కార్మికులు ఒక్కసారిగా అస్వస్థతకు గురవ్వడంతో వారిని రాయచూర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (రిమ్స్)కు తరలించారు. అయితే అప్పటికే ముగ్గురు మృతిచెందినట్లుగా వైద్యులు గుర్తించారు.
మృతులను తెలంగాణలోని నారాయణపేట జిల్లా కృష్ణ మండలం ఆలంపల్లికి చెందిన గణేశ్, మధ్యప్రదేశ్లోని కట్నీ జిల్లాకు చెందిన విక్రమ్, సంజయ్లుగా గుర్తించారు. వీరంతా 20 నుంచి 25 ఏళ్లలోపు వారేనని అధికారులు తెలిపారు. ఇక ఈ ఘటనలో ఏపీలోని అనంతపురం జిల్లాకు చెందిన హేమంత్, శివకుమార్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ప్రస్తుతం వారు ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా.. ఒకరి పరిస్థితి విషమంగా ఉంది.
ప్రమాదంపై సమాచారం అందుకున్న యాద్గిర్ జిల్లా ఎస్పీ పృథ్విక్ శంకర్ ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. ప్రమాదం ఎలా జరిగిందనే దానిపై దర్యాప్తు చేపట్టారు.