అన్నపురెడ్డిపల్లి: టీఆర్ఎస్ తోనే అభివృద్ధి సాధ్యమని అశ్వారావుపేట ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు స్పష్టం చేశారు. శనివారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు సమక్షంలో ఎంపీపీ సున్నం లలిత, అన్నపురెడ్డిపల్లి సర్పంచ్ పద్మ, తొట్టిపంపు సర్పంచ్ సున్నం చిరంజీవి, ఉపసర్పంచ్లు పర్సా వెంకటేశ్వరరావు, కణితి ఆదినారాయణ, అన్నపురెడ్డిపల్లి, తొట్టిపంపు గ్రామాలలోని కాంగ్రెస్ పార్టీకి చెందిన పలు కుటుంబాలు టీఆర్ఎస్ పార్టీలో చేరారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మెచ్చా ప్రజాప్రతినిధులకు, నాయకులు, కార్యకర్తలకు టీఆర్ఎస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ…. రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీకే ప్రజల సంపూర్ణ మద్దతు ఉందని, సీఎం కేసీఆర్ పరిపాలనలో ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉన్నారన్నారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ సారధ్యంలో పార్టీ పటిష్టతకు కృషి చేద్దామని, నాయకులు, కార్యకర్తలు వర్గ విభేదాలకు తావు లేకుండా పార్టీ బలోపేతం కోసం సమిష్టిగా పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు.
తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు చేరేలా చూడాలని, ప్రతి నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు బోయినపల్లి సుధాకర్రావు, మండల రైతు బంధు కన్వీనర్ భీమిరెడ్డి శ్రీనివాసరెడ్డి, నాయకులు కొత్తూరి వెంకటేశ్వరరావు, భూపతి నరసింహారావు, నేరళ్ల లాలయ్య, వీరబోయిన వెంకటేశ్వర్లు, అప్పారావు, వాడే రాంబాబు తదితరులు పాల్గొన్నారు.