దుమ్ముగూడెం: తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను చూసి టీఆర్ఎస్ పార్టీలో చేరినట్లు లక్ష్మీనగరం, కొత్తపల్లి ఎంపీటీసీలు మద్ది వనజ, పూసం ధర్మరాజులు శుక్రవారం తెలిపారు. ఎమ్మెల్సీ ఎన్నిక నేపథ్యంలో భద్రాచలం వచ్చిన ప్రభుత్వ విప్, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు, టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ తెల్లం వెంకట్రావు, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు అన్నెం సత్యనారాయణమూర్తి, మండల కార్యదర్శి కణితి రాముడు,జడ్పీటీసీ తెల్లం సీతమ్మ, ఎంపీపీ రేసు లక్ష్మిల సమక్షంలో ఎంపీటీసీలు పార్టీ తీర్ధం పుచ్చుకున్నారు.
పార్టీలో చేరిన సీపీఎం, స్వతంత్ర ఎంపీటీసీలకు రేగా కాంతారావు గులాబీ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై టీఆర్ఎస్లో చేరుతున్నట్లు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో మైనార్టీ సెల్ అధ్యక్షులు రహీమ్, ఎంపీటీసీలు తునికి సీత, మడకం రామారావు, తెల్లం భీమరాజు, సోడి తిరుపతిరావు, కణితి లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.