రుద్రంపూర్, మార్చి 08 : పవిత్ర రంజాన్ మాసం దాతృత్వం, పరస్పర సహకారం సందేశాన్ని చాటుతూ జమాతే ఇస్లామిక్ హింద్ సాంఘిక విభాగం ఆధ్వర్యంలో అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వ్యక్తికి ఆర్థిక సహాయం ఆదివారం చుంచుపల్లి మండలం రుద్రంపూర్ పంచాయతీ పరిధిలోని మసీద్ ఏ ఖూబా లో అందజేశారు. ఈ సందర్భంగా జమాతే ఇస్లామిక్ హింద్ సభ్యులు షమీం మాట్లాడుతూ.. ఇది కేవలం ఆర్థిక సహాయం మాత్రమే కాదని, ఆపత్కాలంలో తోడుగా నిలిచే మానవీయ సహకారం మాత్రమేనని అన్నారు. రంజాన్ మాసం మనకు ఉపవాసం పాటించడంతో పాటు మన సంపాదనలో కొంత భాగాన్ని పేదలు, అభాగ్యులు, అనాథలకు పంచి ఇవ్వాలని నేర్పుతుందన్నారు. సమాజంలో అవసరమైన వారికి చేయూత ఇవ్వడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రుద్రంపూర్ మసీద్ ఏ ఖూబా అధ్యక్షుడు అజీజ్ ఖాన్, సోను భాయ్, ఖాసీం సాబ్, పాషా పాల్గొన్నారు.