బూర్గంపహాడ్, ఏప్రిల్ 28 : కార్మిక సమస్యలపై ఐటీసీ యాజమాన్యానికి పలుమార్లు వినతిపత్రాలు ఇచ్చినా కనికరం లేదని కాంట్రాక్టు కార్మిక సంఘాల జేఏసీ కన్వీనర్ పాటి సోమిరెడ్డి, కో-కన్వీనర్లు సానికొమ్ము రామచంద్రారెడ్డి, ఎండీ.యాకూబ్పాషా, బల్లెం నాగయ్య మండిపడ్డారు. మంగళవారం 34వ రోజుకు రిలే నిరాహార దీక్షలు చేరుకోవడంతో దీక్షలకు బీఆర్టీయూ కాంట్రాక్టు వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడు కుందూరు పెద్దిరెడ్డి, ఐఎన్టీయూసీ కాంట్రాక్టు వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడు ఉర్లుగొండ వీరన్న కార్మికులకు మద్దతు పలికారు. ఈ సందర్భంగా జేఏసీ బాధ్యులు మాట్లాడుతూ కార్మికులు తమ సమస్యలపై ఎండను సైతం లెక్కచేయకుండా నెలరోజులకు పైగా దీక్షలు చేస్తున్నా నిమ్మకు నీరెత్తినట్లు యాజమాన్యం వ్యవహరిస్తుందన్నారు. కార్మిక సమస్యలపై జేఏసీ పలుమార్లు వినతిపత్రాలు అందజేసినా పట్టించుకోకుండా కాలయాపన చేస్తుందని, మున్ముందు కార్మికుల ఆగ్రహానికి యాజమాన్యం గురికాక తప్పదని హెచ్చరించారు. రాబోయే రోజుల్లో పోరాటం ఉధృతం కానుందని హెచ్చరించారు. దీక్షలో జేఏసీ నాయకులు చుక్కపల్లి బాలాజీ, సూరిశెట్టి జగదీష్, కందాల వెంకటరెడ్డి, కాంట్రాక్టు కార్మికులు పాల్గొన్నారు.