బూర్గంపహాడ్, ఏప్రిల్ 23 : ఐటీసీ యాజమాన్యం కార్మికుల పట్ల నిర్లక్ష్య వైఖరి విడనాడి అపరిష్కృత సమస్యలు పరిష్కరించాలని, వేతన ఒప్పంద పెండింగ్ సమస్యలు తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ కార్మిక జేఏసీ కన్వీనర్, బీఆర్డీయూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడు సానికొమ్ము శంకర్రెడ్డి ఆధ్వర్యంలో ఐటీసీ కర్మాగారంలో అడ్మిన్ బ్లాక్ వద్ద కార్మికులు మూతికి నల్ల మాస్కులు ధరించి పెద్ద ఎత్తున మౌన ప్రదర్శన నిర్వహించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 13వ వేతన ఒప్పంద పెండింగ్ సమస్యలు అలాగే ఉన్నాయని, 14వ వేతన ఒప్పందంలో జాప్యం జరుగుతుందని దీనికి ఐటీసీ యాజమాన్యం, గుర్తింపు సంఘం నిర్లక్ష్య వైఖరే కారణమన్నారు. త్వరితగతిన కార్మికులకు రూ.22 వేల వేతన ప్యాకేజీ, వందశాతం అన్లిమిటెడ్ మెడికల్, బదిలీలందరినీ రెగ్యులర్ చేయడంతో పాటు కాంట్రాక్టు కార్మికులకు ఆమోదయోగ్యమైన వేతన సదుపాయం కల్పించాలని తదితర అంశాలపై కార్మికులు నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు.
గుర్తింపు సంఘంతో పాటు ఐటీసీ యాజమాన్యం కార్మికులకు మంచి వేతన ఒప్పందం చేయకపోతే కార్మిక జేఏసీ మున్ముందు తీసుకునే నిర్ణయాలకు యాజమాన్యం, గుర్తింపు సంఘాలు బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. రాబోయే కాలంలో కార్మిక జేఏసీ సమస్యల పరిష్కారం కోసం పోరాటం మరింత ఉధృతం చేస్తుందని, ఇప్పటికైనా కార్మికుల సమస్యలు పరిష్కరించి వేతన ఒప్పందంలో మెరుగైన ప్యాకేజీ తీసుకురావాలని, లేనిపక్షంలో జేఏసీతో కలిసివస్తే మంచి వేతన ఒప్పందం చేయడానికి సహకారం అందిస్తామన్నారు. ఈ మౌన ప్రదర్శనకు పెద్ద సంఖ్యలో కార్మికులు, కాంట్రాక్టు కార్మికులు, కార్మిక సంఘాల నాయకులు పాల్గొన్నారు.