కొత్తగూడెం గణేష్ టెంపుల్, ఏప్రిల్ 14 : ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలని సిపిఐ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి షాబీర్ పాషా, కార్పొరేషన్ మేయర్ ముడు గణేష్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం బస్టాండ్ సెంటర్లో పీఆర్టీయూ ఆధ్వర్యంలో నిర్వహించిన రెండు రోజుల దీక్ష శిబిరాన్ని వారు సందర్శించి మాట్లాడారు. ప్రభుత్వం లో భాగంగా ఉండి రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వామ్యం అయిన ఉపాధ్యాయ ఉద్యోగుల ఇబ్బందులను గుర్తించి పరిష్కరించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉందన్నారు. ప్రజా సమస్యలు అయినా, ఉద్యోగ ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి అయినా ఐక్య పోరాట ఉద్యమాలే పరిష్కారానికి మార్గం అన్నారు.
గత రెండు సంవత్సరాల నుండి ఉద్యోగ ఉపాధ్యాయ సమస్యలు పరిష్కారానికి నోచుకోకపోవడం శోచనీయం అన్నారు. తెలంగాణ ఉద్యమం సమయంలో ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలు చేపట్టిన ఉద్యమం చరిత్రను మలుపు తిప్పిందని అటువంటి వారి సమస్యలు పరిష్కరించటానికి ప్రభుత్వం కాలయాపన చేయటం సరికాదన్నారు. రిటైర్డ్ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు వెస్లీ, కోటేశ్వర రావు, రిటైర్ పోలీస్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసరావు, విద్యానగర్ సర్పంచ్ శాంతి శ్రీ ప్రసాద్, ఉప సర్పంచ్ మురళి, వెంకట్, కొత్తగూడెం జమలయ్య దీక్షా శిబిరాన్ని సందర్శించి సంఘీభావం తెలిపారు.

‘ఉద్యోగ, ఉపాధ్యాయ సమస్యలు పరిష్కరించాలి’