ఆళ్లపల్లి, ఆగస్టు 26 : ప్రజా సమస్యలపై నిలదీస్తున్న బీఆర్ఎస్ నాయకుడు రేగా కాంతారావును విమర్శించడమే కాంగ్రెస్ నాయకులు పనిగా పెట్టుకున్నారని బీఆర్ఎస్ ముస్లిం మైనారిటీ ఆళ్లపల్లి మండలాధ్యక్షుడు మొహమ్మద్ ఆదాం, యూత్ నాయకుడు మిరియాల చింటూ మండిపడ్డారు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమై, ప్రజల దృష్టిని మళ్లించేందుకే బీఆర్ఎస్ నాయకులపై వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారని దుయ్యబట్టారు. బుధవారం ఆళ్లపల్లి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ నాయకులపై తప్పులు కేసులు పెడుతూ నాయకులను ఇబ్బందులకు గురి చేస్తుందన్నారు. అందులో భాగంగానే పినపాక మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావుపై తప్పుడు కేసులు మోపినా హైకోర్టులో నిలవలేదన్నారు. రేగా కాంతారావు తన ఆస్తులు అక్రమంగా ఉన్నాయని కాంగ్రెస్ ప్రభుత్వం పదేపదే వాదిస్తున్న సమయంలో తన అక్రమ ఆస్తులు నిరూపించాలని మణుగూరు అంబేద్కర్ సెంటర్ వద్ద వేచి ఉంటే అక్కడికి వచ్చి నిరూపించలేని కాంగ్రెస్ నాయకులు మండల కేంద్రాల్లో ప్రెస్ మీట్ పెట్టి జబ్బలు చరుచుకుంటున్నారని ఎద్దేవా చేశారు. ఇప్పటికైనా ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారెంటీలు, 420 హామీలను అమలు చేసే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు.