– జాతీయ గేయం ప్రాధాన్యత విద్యార్థులు తెలుసుకోవాలి
– ఇల్లెందు ఎమ్మెల్యే కోరం కనకయ్య
– వందేమాతరం, రాజ్యాంగపై ఫొటో ఎగ్జిబిషన్ ప్రారంభం
ఇల్లెందు, జనవరి 20 : స్వాతంత్య్ర ఉద్యమ శంఖారావం వందేమాతరం గేయానికి 150 ఏళ్లు నిండిన సందర్భాన్ని గుర్తుచేసే అరుదైన చిత్రాలతో పాటు భారత రాజ్యంగ రచన ఘట్టాలను తెలియజేసేలా కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖకు చెందిన సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ ఏర్పాటు చేసిన ఛాయాచిత్ర ప్రదర్శనను ఇల్లెందు ఎమ్మెల్యే కోరం కనకయ్య మంగళవారం ప్రారంభించారు. సింగరేణి గ్రౌండ్లో ఏర్పాటు చేసిన ఈ ఎగ్జిబిషన్ ఈ నెల 22 వరకు అందుబాటులో ఉంటుంది. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. వందేమాతరం అనేది కేవలం ఒక గీతం కాదని, అది భారత స్వాతంత్య్ర పోరాటానికి ప్రాణం పోసిన త్యాగస్ఫూర్తి, దేశభక్తి, జాతీయ ఐక్యతకు ప్రతీక అన్నారు. వందేమాతరం నినాదం భారతీయుల ఆత్మగౌరవానికి, స్వాతంత్య్ర ఉద్యమంలో వారి తపన-త్యాగాలకు ప్రతిరూపమన్నారు.
సుమారు 150 సంవత్సరాల క్రితం మహాకవి బంకించంద్ర చటర్జీ రచించిన వందేమాతరం గీతం భారతమాత ఔన్నత్యం, ఆధ్యాత్మిక వైభవం, సాంస్కృతిక గొప్పతనాన్ని ప్రతిబింబిస్తుందని తెలిపారు. బ్రిటిష్ పాలకుల “విభజించి పాలించు” విధానానికి వ్యతిరేకంగా దేశ ప్రజలను ఏకం చేసిన శక్తి వందేమాతరమేనని, కులం, మతం, ప్రాంత భేదాలు మరిచి “దేశమే ప్రథమం” అన్న భావనను పెంపొందించిందని ఆయన అన్నారు. 1938లో నాటి హైదరాబాద్ సంస్థానంలో ప్రారంభమైన వందేమాతర ఉద్యమాన్ని నిజాం ప్రభుత్వం నిషేధించిన విషయాన్ని గుర్తు చేసిన ఆయన మహనీయుల త్యాగాలను కొనియాడారు. ఆనాటి త్యాగాలను నేటి తరానికి తెలిసేలా ఎగ్జిబిషన్ ఉందని కొనియాడారు. నేటి తరం వందేమాతరం 150వ ఉత్సవాలను స్ఫూర్తిగా తీసుకుని అభివృద్ధిలో భాగస్వాములవ్వాలని కోరారు. విద్యార్థినులు, యువతులు విద్య, కెరీర్పై దృష్టి సారించి విజయం సాధించాలన్నారు. ఈ సందర్భంగా వివిధ కళాశాలలు, పాఠశాలల విద్యార్థులకు నిర్వహించిన వ్యాసరచన పోటీలలో విజేతలకు ఎమ్మెల్యే బహుమతులు, సర్టిఫికెట్లు అందజేశారు.
అంతకుముందు సింగరేణి జనరల్ మేనేజర్ వి.కృష్ణయ్య మాట్లాడుతూ వందేమాతరం స్వాతంత్ర పోరాటానికి ప్రతీక అని కొనియాడారు. వందే మాతరం స్ఫూర్తి నేటి యువతకు ఎంతో అవసరం అని పేర్కొన్నారు. సీబీసీ ఫీల్డ్ పబ్లిసిటీ అధికారి బి.తరుణ్ కుమార్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో సీబీసీ అసిస్టెంట్ డైరెక్టర్ కోటేశ్వర్రావు తన ప్రారంభ ప్రసంగంలో వందే మాతరం గేయం, స్వాతంత్య్ర పోరాటంలో పోషించిన కీలక పాత్రను ప్రస్తావించారు. జాతీయగేయంగా తరతరాలుగా ప్రజలను ప్రేరేపిస్తూ దేశవ్యాప్తంగా లోతైన దేశభక్తి భావాన్ని పెంపొందించిందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఇల్లెందు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బానోత్ రాంబాబు, పురపాలక మాజీ చైర్మన్, వివిధ కళాశాలల ప్రిన్సిపాళ్లు, అధ్యాపకులు, సిబ్బంది, వివిధ కళాశాలల విద్యార్థులు పాల్గొన్నారు.

Yellandu : వందేమాతరం స్ఫూర్తితో యువత ముందుకు సాగాలి