మణుగూరు: ఏరియా బొగ్గు ఉత్పత్తి నిర్దేశించిన లక్ష్యానికి 10.52లక్షల టన్నులకు గాను 96.70లక్షల టన్నులు 92శాతం ఉత్పత్తి సాధించి, ఓబీ 96 శాతం వెలికితీసిందని బొగ్గు బ్లాకుల ప్రైవేటీకరణను నిరసిస్తూ అన్ని యూనియన్లు ఇచ్చిన పిలుపు మేరకు తలపెట్టిన సమ్మె ప్రభావం బొగ్గు ఉత్పత్తిపై పడిందని జీఎం జక్కం రమేశ్ తెలిపారు. శుక్రవారం జీఎం కార్యాలయంలో జరిగిన సమావేశంలో విలేకరులకు ఉత్పత్తి వివరాలు వెల్లడించారు. నిర్ధేశించిన లక్ష్యానికి మించి బొగ్గు ఉత్పత్తి సాధించిన మణుగూరు ఓసీ-4 అధికారులను, ఉద్యోగులను, కార్మిక నేతలను ప్రత్యేకంగా అభినందించారు.
కొండాపురం గని నష్టాల్లో నడుస్తున్న నేపథ్యంలో ఉత్పత్తి పెంచేందుకు అధికారులు పటిష్టమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. యంత్ర వినియోగంలో సింగరేణి వ్యాప్తంగా మొదటి స్థానంలో నిలిచిన పీకేఓసీ గని అధికారులను ప్రత్యేకంగా అభినందించారు. ఈ సమావేశంలో అధికారులు వెంకట్రావు, లక్ష్మీపతిగౌడ్, సలగల రమేశ్, వెంకటరమణ, నర్సిరెడ్డి, నాగరాజు, సింగు శ్రీనివాస్, షబ్బీరుద్దీన్, ఉషారాణి తదితరులు పాల్గొన్నారు.