ఇల్లెందు, జూన్ 14 : కక్షిదారులు క్షణికావేశంలో పెట్టుకున్న పోలీస్ కేసులు రాజీపడదగిన, మనోవర్తి , గృహ హింస, చెక్ బౌన్స్, ప్రామిసరీ నోటు కేసుల్లో ఇరువర్గాలు కోర్టుకు వచ్చి రాజీ కుదుర్చుకున్నట్లైతే ఇరు వర్గాలు గెలిచినట్లే అవుతుందని ఇల్లందు ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి దేవరపల్లి కీర్తిచంద్రిక రెడ్డి అన్నారు. శనివారం ఉదయం స్థానిక ఇల్లందు ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి కోర్టు ఆవరణలో జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమాన్ని ఇల్లందు మండల న్యాయ సేవ సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. రాజీపడదగిన కేసుల్లో కక్షిదారులు రాజీపడితే ఎంతో విలువైన కాలాన్ని, డబ్బును ఆదా చేసుకోవచ్చన్నారు. కక్షిదారులు పంతాలకు పోకుండా లోక్ అదాలత్ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
అనంతరం ఇల్లందు బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జడ్జి చేతుల మీదుగా కక్షిదారులకు మొక్కలు పంపిణీ చేశారు. విధిగా ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి పర్యావరణాన్ని పరిరక్షించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇల్లందు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కె.ఉమామహేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి కీర్తి కార్తీక్, సీనియర్ న్యాయవాదులు పెద్దూరి వెంకట నరసయ్య, పప్పుల గోపీనాథ్, దంతాల ఆనంద్, ఎస్.వెంకటేశ్వర్లు, జూనియర్ న్యాయవాదులు, పోలీస్ సిబ్బంది, కోర్టు సిబ్బంది, బ్యాంక్ సిబ్బంది పాల్గొన్నారు.