– అంబేద్కర్ విగ్రహానికి వినతి
– కాంగ్రెస్ కు రోజులు దగ్గర పడ్డాయి : రాకేష్ రెడ్డి
భద్రాద్రి కొత్తగూడెం, సెప్టెంబర్ 08 : బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను అక్రమంగా అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ కొత్తగూడెం జిల్లా కేంద్రంలో ఆ పార్టీ నాయకులు నల్ల చొక్కాలతో భారీ నిరసన ప్రదర్శన చేశారు. ఎంపీ వద్దిరాజు రవిచంద్ర. మాజీ మంత్రి వనమా వెంకటేశ్వరరావు ఆదేశాలతో పార్టీ సీనియర్ నాయకుడు ఏనుగుల రాకేష్ రెడ్డి కొత్తగూడెం పోస్ట్ ఆఫీస్ సెంటర్ నుండి సూపర్ బజార్ సెంటర్ వరకు నల్ల చొక్కాలతో భారీ నిరసన ర్యాలీ చేశారు. వద్దురా నాయనా కాంగ్రెస్ పాలన.. డౌన్ డౌన్ సీఎం.. డౌన్ డౌన్ రేవంత్ రెడ్డి.. ఖబడ్దార్ రేవంత్ అంటూ నినాదాలు చేస్తూ మహిళలు నిరసనలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కొత్తగూడెం క్లబ్లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. ఇది గౌరవమైన సభ కాదని కౌరవుల సభలా ఉందన్నారు. అసెంబ్లీ సాక్షిగా ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలను అక్రమంగా అరెస్టు చేసి దౌర్జన్యానికి పాల్పడిన చరిత్ర కాంగ్రెస్ కే దక్కిందన్నారు.
వందేళ్ల చరిత్రని గొప్పలు చెప్పుకునే కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి వచ్చి నాలుగు ముక్కలు చేశాడని ఇప్పుడు బీఆర్ఎస్ వైపు జనం ఉండడంతో రేవంత్కు ఏం చేయాలో అర్థం కాక వెర్రి వేషాలు వేస్తున్నాడన్నారు. 14 ఏళ్ల పోరాటంతో సాధించిన తెలంగాణను తెచ్చుకున్న కేసీఆర్ పై సీఎం రేవంత్ తప్పుడు మాటలు మాట్లాడుతూ పిచ్చి వేషాలు వేస్తున్నాడని మండిపడ్డారు. వచ్చేది బిఆర్ఎస్ ప్రభుత్వమేనని అన్నారు. రేవంత్ రెడ్డి మాయ మరాఠీలా మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చాడని, ఇచ్చిన ఒక్క హామీ కూడా అమలు చేయలేకపోయాడన్నారు. తెలంగాణ తెచ్చిన కేసీఆర్ ను నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నాడని, దానికి ప్రజలే తగిన బుద్ధి చెబుతారన్నారు. ఈ ప్రదర్శనలో కొత్తగూడెం కార్పొరేషన్ కార్పొరేటర్లు సింధు తపస్వి, మధుచంద్, వీరమ్మ, సాగర్, గుణ చరిత. రాంబాబు. భీమా శ్రీధర్. అనుదీప్. కొట్టి వెంకటేశ్వర్లు. శ్రీరామ్మూర్తి, విశ్వనాదం. మంతపురి రాజు గౌడ్, బాధవత్ శాంతి, సోనా హుస్సేన్, నవతన్. జగన్, మదాసి పద్మ, బట్టు మంజుల, వేమూరి శివ, అంబుల వేణుగోపాల్, డీకొండ సునీత, శ్రీకాంత్ పాల్గొన్నారు.

బీఆర్ఎస్ ఎమ్మెల్యేల అక్రమ అరెస్టులపై కొత్తగూడెంలో భారీ ప్రదర్శన