లక్ష్మిదేవిపల్లి, మే 20 : లక్ష్మిదేవిపల్లి మండలంలోని లోతు వాగులో సంభవించిన అగ్ని ప్రమాదంలో ఓ ఇల్లు పూర్తిగా దగ్ధమైంది. సుమారు రూ.5 లక్షలకు పైగా నష్టం వాటినట్లు సమాచారం. లోతు వాగు గ్రామ పంచాయతీ మాదిగ ప్రోలులో స్థానిక రైతు తన పొలంలోని వ్యర్థాలకు నిప్పు పెట్టగా నిప్పు రవ్వలు ఎగిరి వచ్చి అశోక్ నగర్ గ్రామ పంచాయతీ వర్కర్ గా పని చేస్తున్న పాయం సతీశ్ ఇంటిపై పడడంతో ఇల్లు మొత్తం కాలిపోయింది. 100 బస్తాల ధాన్యం, మూడు వ్యవసాయం మోటర్లు, ఒక గ్లామర్ బైక్, ఇంట్లోని వస్త్రాలు సామన్లు మొత్తం అగ్నికి ఆహుతి అయ్యాయి. విషయం తెలుసుకున్న లోతువాగు సర్పంచ్, ఉప సర్పంచ్ వెంటనే అక్కడికి చేరుకుని చుట్టుపక్కల నివాసాలకు మంటలు వ్యాప్తి చెందకుండా పంచాయితీ ట్యాంకర్ తో నీటిని కొట్టి మంటలను అదుపు చేశారు. ఈ ఘటనపై సర్పంచ్ ఈసం కళ్యాణి లక్ష్మీదేవిపల్లి తాసీల్దార్, ఎస్ఐకు సమాచారం అందించి బాధితులకు ప్రభుత్వ నుండి సహాయం అందే విధంగా చూడాలని కోరారు.