- జిల్లా అధికారులు స్పందించి సమస్యలు తక్షణమే పరిష్కరించాలి
– సిపిఎం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి మచ్చ వెంకటేశ్వర్లు డిమాండ్
జూలూరుపాడు, జూలై 11 : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండల పరిధిలోని పడమట నర్సాపురం గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి మచ్చ వెంకటేశ్వర్లు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సిపిఎం ప్రతినిధుల బృందం బాలికల ఆశ్రమ పాఠశాలను శనివారం సందర్శించి, క్షేత్రస్థాయిలో ఉన్న పరిస్థితులను పరిశీలించింది. ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థినులతో మాట్లాడి వారు ఎదుర్కొంటున్న పలు సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మచ్చ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. పాఠశాలలు ప్రారంభమై నెల రోజులు గడుస్తున్నా, విద్యార్థులకు ఇంతవరకు కనీసం నోట్ బుక్స్ కూడా పంపిణీ చేయకపోవడం దారుణమన్నారు. నిరుపేద కుటుంబాలకు చెందిన గిరిజన పిల్లలు కనీసం దుప్పట్లు, సోపులు వంటి నిత్యావసరాలను కూడా ఇళ్ల నుంచే తెచ్చుకోవాల్సిన దుస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు.
కనీసం తాగేందుకు, నిత్యకృత్యాలకు నీటి వసతి లేక విద్యార్థినులు తీవ్ర అవస్థలు పడుతుంటే జిల్లా అధికారులకు తెలిసి కూడా పట్టించుకోకపోవడం సిగ్గుచేటని మండిపడ్డారు. విద్యార్థినులు ఇన్ని ఇబ్బందులు పడుతున్నా అధికారులు చోద్యం చూడటం తగదన్నారు. 6, 7వ తరగతుల విద్యార్థులకు ఇంగ్లీష్ టెక్ట్స్ బుక్స్, 4వ తరగతి విద్యార్థులకు తెలుగు టెక్స్ట్ బుక్స్ ఇంతవరకు అందలేదని, తక్షణమే విద్యార్థులందరికీ పాఠ్యపుస్తకాలతో పాటు యూనిఫాంలను కూడా అందించాలని డిమాండ్ చేశారు. సమస్యలను యుద్ధ ప్రాతిపదికన పరిష్కరించాలని, లేనిపక్షంలో సిపిఎం ఆధ్వర్యంలో పెద్దఎత్తున ఆందోళనలు చేపడతామని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు రేపాకుల శ్రీనివాస్, మండల కార్యదర్శి యాసా నరేష్, మండల కమిటీ సభ్యులు వలమల చందర్ రావు, రెడ్డి, గోవిందు, తాటి పద్మ, గార్లపాటి వెంకటి, బోడా భీమిత్ర, జల్లిక రాధాకృష్ణ, శాఖ కార్యదర్శులు ఇల్లంగి సీతారాములు, తోలెం సరస్వతి, మల్లయ్య, దానయ్య, సామ్య పాల్గొన్నారు.

‘ఆశ్రమ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనలో ప్రభుత్వం వైఫల్యం’