భద్రాచలం : ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు గోదావరి పరవళ్లు తొక్కుతున్నది. సాయంత్రం 6 గంటలకు భద్రాచలం వద్ద నీటిమట్టం 26.5 అడుగులకు చేరింది. ఇక్కడ సుమారు 3,14,132 క్యూసెక్కుల ప్రవాహం పెరిగినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు.
సీఎం కేసీఆర్ ఆదేశాలతో గోదావరిలో వరద పరిస్థితిపై ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నట్లు రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తెలిపారు. కలెక్టర్ అక్కడే ఉండి పరిస్థితిని పర్యవేక్షిస్తున్నట్లు పేర్కొన్నారు. ‘‘భద్రాచలం వద్ద ఈ రాత్రికి అధికారులు మొదటి, రెండో ప్రమాద హెచ్చరికలు జారీ చేయనున్నారు. ఇప్పటికే లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. నదిలో రెండు 2 నెలలపాటు ఈ ప్రవాహం కొనసాగవచ్చు. గతేడాది 61 అడుగుల ఎత్తు వరద వచ్చినా ఎదుర్కొన్నాం’’ అని మంత్రి పువ్వాడ చెప్పారు.