పాల్వంచ, జూన్ 12 : కొత్తగూడెం కార్పొరేషన్ పరిధిలోని పాల్వంచ 48వ డివిజన్లో ఎర్రగుంట గ్రామంలోని చెరువును ఆక్రమణదారుడి నుంచి విముక్తి కల్పించాలని కోరుతూ గ్రామ రైతులు శుక్రవారం రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. చెరువు వద్ద టెంట్ వేసి రైతులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఈ నిరాహార దీక్షలు చేపట్టారు. చెరువును ఓ వ్యక్తి ఆక్రమించి శిఖం భూమి సాగు చేస్తూ చెరువులోని నీరంతా వెళ్లగొట్టి పంట పొలాలకు నీళ్లు లేకుండా, అలాగే పశువులు తాగేందుకు నీళ్లు లేకుండా చేయడాన్ని నిరసిస్తూ రైతులు ఈ నిరసన చేపట్టారు. ఆక్రమణదారుడు పట్టా ఉందని చెప్పి, చెరువు మొత్తం తనదేనంటూ రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నాడని, తక్షణమే జిల్లా కలెక్టర్ స్పందించి చెరువును కాపాడాలని రైతులు కోరారు. ఆక్రమణదారుల నుండి చెరువును కాపాడేంత వరకు ఈ రిలే నిరాహార దీక్ష కొనసాగిస్తామని రైతులు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం డివిజన్ నాయకుడు దొడ్డ రవికుమార్, రైతులు మండల వెంకన్న, సత్యనారాయణ, మేక ప్రసాద్, నరసింహమూర్తి, తోడేటి సత్యం, రెడ్డిమల్ల వెంకటయ్య, ఆరేపల్లి సత్యనారాయణ, ఆంజనేయులు, శంకర్, బూరా వెంకటేశ్వరావు, మేక శ్రీనివాసరావు పాల్గొన్నారు.