– జీఎంకు టీబీజీకేఎస్ రాష్ట్ర జనరల్ సెక్రటరీ కాపు కృష్ణ మెమొరాండం
రుద్రంపూర్, సెప్టెంబర్ 12 : సింగరేణి సంస్థలో గుర్తింపు కార్మిక సంఘాల రెండేళ్ల కాలపరిమితి పూర్తయినందున, కొత్తగా కార్మిక సంఘాల ఎన్నికలు నిర్వహించాలని, ఎన్నికలు జరిగే వరకు సంస్థలోని అన్ని యూనియన్లను సమానంగా చూడాలని కోరుతూ టీబీజీకేఎస్ రాష్ట్ర జనరల్ సెక్రటరీ కాపు కృష్ణ శనివారం ఏరియా జీఎం సీహెచ్ వెంకటరమణకు మెమొరాండం అందజేశారు. ఈ సందర్భంగా టీబీజీకేఎస్ నాయకులు మాట్లాడుతూ.. సింగరేణిలో కార్మిక సంఘాల ఎన్నికలు 2023 డిసెంబర్ 27న సీక్రెట్ బ్యాలెట్ ద్వారా నిర్వహించారని తెలిపారు. అదే రోజున డిప్యూటీ చీఫ్ లేబర్ కమిషనర్ (హైదరాబాద్) కార్యాలయం ద్వారా ఎన్నికల ఫలితాలు, గుర్తింపు పొందిన యూనియన్ హోదాను ప్రకటించారని పేర్కొన్నారు. అయితే యూనియన్ల అంతర్గత అంశాల కారణంగా ఎన్నికైన సంఘాలకు గుర్తింపు, ప్రాతినిధ్య హోదా పత్రాలు 2024 సెప్టెంబర్ 9న అందాయని వివరించారు. ఎన్నికలు నిర్వహించి ఇప్పటికే రెండేళ్లకు పైగా కాలం పూర్తయిందని, గుర్తింపు హోదా పత్రాలు అందుకున్న తేదీని ప్రామాణికంగా తీసుకున్నా రెండేళ్ల కాలపరిమితి 2026 సెప్టెంబర్ 8తో పూర్తయిందని వారు తెలిపారు.
గతంలో సింగరేణిలో ఏడు దఫాలుగా కార్మిక సంఘాల ఎన్నికలు నిర్వహించారని, గత ఎన్నికలకు ముందు డిప్యూటీ చీఫ్ లేబర్ కమిషనర్ రెండేళ్ల కాలపరిమితితోనే ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు తెలియజేశారని పేర్కొన్నారు. ఎన్నికల నిర్వహణకు సంబంధించి టీబీజీకేఎస్ తరఫున హైకోర్టులో దాఖలైన పిటిషన్ శనివారం విచారణకు రాగా, తదుపరి విచారణను ఈ నెల 22వ తేదీకి వాయిదా వేసినట్లు నాయకులు తెలిపారు. సింగరేణిలో ప్రజాస్వామ్యయుతమైన, పారదర్శకమైన ప్రాతినిధ్య వ్యవస్థ కొనసాగేందుకు వీలైనంత త్వరగా కొత్త కార్మిక సంఘాల ఎన్నికలు నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని వారు కోరారు. ఎన్నికలు పూర్తయి ఫలితాలు ప్రకటించే వరకు సంస్థలో పనిచేస్తున్న అన్ని కార్మిక సంఘాలకు సమాన హోదా కల్పించి, కార్మికులకు సమాన ప్రాతినిధ్య అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో టీబీజీకేఎస్ ఏరియా వైస్ ప్రెసిడెంట్ గడప రాజయ్య, ఇన్చార్జి జీకే సంపత్కుమార్, ఫిట్ సెక్రటరీ దివ్య, తిరుపతి, నమిళ్ల వెంకటేశ్వర్లు, రాజకుమార్, అన్వర్, రాములు, శ్రావణ్, నాగరాజు పాల్గొన్నారు.