Jammu and Kashmir : రీల్స్ కోసం కొందరు చేసే పిచ్చి పనులు తీవ్ర ఇబ్బందులు తెచ్చిపెడుతుంటాయి. తాజాగా జమ్మూ కాశ్మీర్లో అలాంటి ఒక ఘటనే జరిగింది. కొందరు యువకులు రీల్స్ కోసం వేగంగా ప్రవహిస్తున్న నదిలోకి స్కార్పియోతో వెళ్లి చిక్కుకుపోయారు. ఇంకా నది ప్రవాహం పెరగడంతో అక్కడే చిక్కుకుపోయారు. ఈ ఘటన జమ్మూ కాశ్మీర్, సోనా మార్గ్లో ఉన్న సింధునదిలో జరిగింది.
శ్రీనగర్కు చెందిన మొహమ్మద్ ఇబాద్ భట్, రియాసి ప్రాంతానికి చెందిన నసీర్ అహ్మద్ ముగల్.. ఇద్దరూ సరదాగా తమ మహీంద్రా స్కార్పియో వాహనంతో సింధు నదిలోకి వెళ్లారు. రీల్స్ కోసం వీడియోస్ తీయడానికి నది మధ్యలోకి స్కార్పియోతో సహా వెళ్లారు. అయితే, వాళ్లు నీళ్లలోకి వెళ్లగానే నది ప్రవాహం పెరిగింది. దీంతో స్కార్పియోను బయటకు తీయడానికి వీలుకాలేదు. పైగా ఆ ఇద్దరూ నదిలో చిక్కుకుపోయారు. దీంతో అక్కడే ఉన్న ఇతరులు పోలీసులకు సమాచారం అందించారు.వారు వచ్చి రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు.
Sonamarg: River Stunt Backfires As SUV Gets Stuck Midstream pic.twitter.com/Ygofg2ijCJ
— Daily Excelsior (@DailyExcelsior1) September 11, 2026
నదిలో చిక్కుకున్న ఇద్దరితోపాటు వాహనాన్ని కూడా బయటకు తీసేందుకు ప్రయత్నించారు. చాలా సేపు శ్రమించిన రెస్క్యూ టీం వారిని, స్కార్పియోను బయటకు తీశారు. ఈ క్రమంలో వాహనం స్వల్పంగా దెబ్బతింది. అయితే, రెస్క్యూ ఆపరేషన్ ఆలస్యమైతే ఆ ఇద్దరూ వాహనంతోపాటు నదిలో కొట్టుకుపోయేవారు. రీల్స్ కోసం నది మధ్యలోకి స్కార్పియోతో వెళ్లిన వారిపై పోలీసులు ఆగ్రహం వ్యక్తం చేసి, కేసు నమోదు చేశారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా చూడాలని, ప్రమాదకర పనులు ఎవరూ చేయకూడదని పోలీసులు హెచ్చరించారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.