చండీగఢ్: బీజేపీ నేత మేనల్లుడికి తన భార్యతో అక్రమ సంబంధం ఉన్నట్లు అతడి స్నేహితుడు అనుమానించాడు. ఈ నేపథ్యంలో బంధువైన మరో వ్యక్తితో కలిసి అతడ్ని కొట్టి చంపాడు. దర్యాప్తు చేసిన పోలీసులు ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు. (BJP leader’s nephew Killed) హర్యానాలోని రేవారిలో ఈ సంఘటన జరిగింది. సెప్టెంబర్ 7న హెచ్పీసీఎల్ రిఫైనరీ సమీపంలోని నిర్మానుష్య రహదారిలో రక్తం మడుగులో పడి ఉన్న బీజేపీ నేత మేనల్లుడైన 40 ఏళ్ల జితేంద్ర మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. ఐరన్ రాడ్తో అతడ్ని కొట్టి హత్య చేసినట్లు తలపై గాయాల ద్వారా తెలుసుకున్నారు. ఆ ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజ్ను పరిశీలించారు. జితేంద్ర కుటుంబ సభ్యుల అనుమానం, ఇతర ఆధారాల సహాయంతో స్నేహితుడైన ప్రవీణ్ అలియాస్ పాప్లా, అతడి మేనల్లుడు అమన్లను పోలీసులు అరెస్ట్ చేశారు. జితేంద్ర హత్య గురించి నిందితులను ప్రశ్నించారు.
కాగా, స్నేహితుడైన జితేంద్రకు తన భార్యతో వివాహేతర సంబంధం ఉందన్న అనుమానంతో హత్య చేసినట్లు ప్రవీణ్ చెప్పాడని పోలీస్ అధికారి తెలిపారు. సెప్టెంబర్ 7న బీర్ పార్టీ పేరుతో అతడ్ని పిలిచి అమన్తో కలిసి ఒక వాహనంలో నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లాడని చెప్పారు. జితేంద్ర వాహనం దిగగానే, ప్రవీణ్ ఇనుప రాడ్తో అతడి తలపై పదేపదే దాడి చేసి హత్య చేసినట్లు వివరించారు. నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీస్ అధికారి తెలిపారు. హత్యకు వినియోగించిన వాహనాన్ని, ఇనుప రాడ్ను స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు వెల్లడించారు.