బూర్గంపహాడ్, జూన్ 09 : ద్విచక్ర వాహనాన్ని డోజర్ ఢీకొన్న ఘటనలో కుమారుడు మృతిచెందగా తండ్రికి గాయాలైన సంఘటన బూర్గంపహాడ్ మండల పరిధిలోని సారపాక చందు బజార్ సమీపంలో మంగళవారం చోటుచేసుకుంది. ఎస్ఐ మేడా ప్రసాద్ తెలిపిన వివరాల ప్రకారం.. పాత సారపాకకు చెందిన చెలికాని ప్రవీణ్, గణేష్ తండ్రీకొడుకులు. చందు బజార్లో ఓ శుభకార్యానికి హాజరై తిరిగి ద్విచక్రవాహనంపై ఇంటికి వెళ్తుండగా మోతే పట్టీనగర్ వైపు నుండి వస్తున్న డోజర్(బుల్) ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో చెలికాని గణేష్(15) అక్కడికక్కడే మృతిచెందగా తండ్రి ప్రవీణ్ కు తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రుడిని చికిత్స కోసం భద్రాచలం తరలించారు. గణేష్ బాబాయి చెలికాని లక్ష్మణ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.