కొత్తగూడెం అర్బన్, ఏప్రిల్ 29 : ఇండ్లు, భూములు, ప్లాట్లు, తనఖా రిజిస్ట్రేషన్ల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకువచ్చిన స్లాట్ బుకింగ్ విధానంతో అమ్మకం, కొనుగోలుదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, వెంటనే దానిని రద్దు చేసి పాత పద్ధతినే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ డాక్యుమెంట్ రైటర్లు కొత్తగూడెం సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయం ముందు మంగళవారం నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పలువురు డాక్యుమెంట్ రైటర్లు మాట్లాడుతూ తమ ఆవేదనను వ్యక్తం చేశారు. స్లాట్ బుకింగ్ విధానంలో స్లాట్ బుక్ చేసుకున్నప్పుడు ఏదైనా సమస్యతో ఆ రోజు రిజిస్ట్రేషన్ చేసుకోకపోతే మరోసారి స్లాట్ బుకింగ్ చేసుకున్నప్పుడు ఇబ్బందులు తలెత్తుతున్నట్లు చెప్పారు. అలాగే సర్వర్ డౌన్ అవుతుందని, ఫలితంగా రిజిస్ట్రేషన్ల సంఖ్య తగ్గుతుందన్నారు. ప్రభుత్వం సైతం ఆదాయం కొల్పోవడంతో పాటు, డాక్యుమెంట్ రైటర్లు కూడా ఇబ్బందులు పడుతున్నట్లు తెలిపారు.
అదే విధంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో రిజిస్ట్రేషన్ ఏరియాలుగా ఉన్న పాల్వంచ, పాత కొత్తగూడెం, సుజాతనగర్, అశ్వారావుపేట, దమ్మపేట మండలాల్లో ఇంటి అసెస్స్మెంట్ నంబర్ల ఆధారంగా రిజిస్ట్రేషన్లు చేయాలని, ఏజెన్సీ ఆధారిత పార్టిషన్ డీడ్లను నమోదు చేసుకోవడానికి అనుమతిని ఇవ్వాలని కోరారు. మున్సిపాలిటీ, గ్రామ పంచాయతీలలో కొంతమంది ఇంటి యజమానులు 30 సంవత్సరాలుగా నివాసం ఉంటున్నప్పటికీ అవగాహన రాహిత్యంతో రిజిస్ట్రేషన్ చేసుకోకుండా పట్టా భూముల్లోనే ఇండ్లు నిర్మించుకుని ఇంటి నంబర్, అసెస్స్మెంట్లు తీసుకుని నివాసం ఉంటున్నట్లు తెలిపారు. ఈ తరహా స్థలాలు, నివాస గృహాలు రిజిస్ట్రేషన్ చేయించుకోవడం ద్వారా ఆస్తికి సంబంధించి సరైన చట్టబద్ధత ఏర్పడుతుందని, భవిష్యత్లో వారసత్వం, కొనుగోలు, అమ్మకం లాంటి వ్యవహారాలు నిరవధికంగా జరుగుతాయని తెలిపారు.
ప్రస్తుతం మున్సిపాలిటీ, గ్రామ పంచాయతీ జారీ చేసిన అసెస్స్మెంట్ నంబర్ల ఆధారంగా రిజిస్ట్రేషన్ చేయించుకోవడంలో కొన్ని అడ్డంకులు ఎదురవుతున్నాయని దీని వల్ల ప్రజలు తమ ఆస్తిని రిజిస్టర్ చేసుకోలేక, భవిష్యత్లో తమ హక్కులను రుజువు చేయడంలో ఇబ్బందులు పడుతున్నారని వివరించారు. అనంతరం వారు ఇన్చార్జి సబ్ రిజిస్ట్రార్ కు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో డాక్యుమెంట్ రైటర్లు జావిద్, అన్వర్, శ్రీకాంత్ సుధాకర్ రాజు, దావూద్, అహ్మద్, చిన్ని, శ్రీను, జీవన్, సారథి పాల్గొన్నారు.