– టీయూసీఐ డిమాండ్
జూలూరుపాడు, మార్చి 28 : కేంద్రంలోని ప్రధాని మోదీ ప్రభుత్వం కార్మికుల ప్రయోజనాలను దెబ్బతీస్తూ తీసుకువచ్చిన నాలుగు లేబర్ కోడ్లను తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ అమలు చేయకూడదని ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా (TUCI) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఉపాధ్యక్షుడు ఏదులాపురం గోపాలరావు డిమాండ్ చేశారు. శనివారం జూలూరుపాడు మండల కేంద్రంలోని ఆటో అడ్డా వద్ద నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ నెల 30న చేపట్టబోయే నిరసన కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్లను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా గోపాలరావు మాట్లాడుతూ.. దశాబ్దాల కాలంగా పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను రద్దు చేసి, కార్పొరేట్లకు లబ్ధి చేకూర్చేలా కేంద్రం ఈ నాలుగు లేబర్ కోడ్లను తెచ్చిందని విమర్శించారు. కేరళ తరహాలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ కోడ్లను వ్యతిరేకిస్తూ శాసనసభలో తక్షణమే తీర్మానం చేయాలన్నారు.
పారిశ్రామిక సంబంధాల కోడ్, వేతన కోడ్, సామాజిక భద్రత కోడ్, వృత్తిపరమైన భద్రత-ఆరోగ్య కోడ్లు కార్మికుల బతుకులను ఛిన్నాభిన్నం చేస్తాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. టీయూసీఐ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా ఈ నెల 30న అన్ని జిల్లా కేంద్రాల్లో లేబర్ కోడ్ ప్రతులను దగ్ధం చేయనున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ నిరసన కార్యక్రమంలో కార్మికులు, అనుబంధ సంఘాల నాయకులు భారీ సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో టీయూసీఐ కొత్తగూడెం ఏరియా ఉపాధ్యక్షుడు రాయల సిద్దు, నాయకులు వీరభద్రం, అరుణ్, సురేశ్, నరేశ్ పాల్గొన్నారు.