పాల్వంచ, మే 06 : భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఏర్పాటు చేసిన సీతారామ ప్రాజెక్ట్కి నిధులు కేటాయించి డిస్ట్రిబ్యూటర్ కెనాల్స్ నిర్మాణం చేపట్టాలని, లేకుంటే జిల్లావ్యాప్త ఉద్యమాన్ని చేపట్టనున్నట్లు తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పోతినేని సుదర్శన్రావు రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. మంగళవారం పాల్వంచ మండలంలోని జగన్నాధపురంలోని ఫంక్షన్ హాల్లో ఎలమంచి వంశీకృష్ణ అధ్యక్షతన జరిగిన జిల్లా సిపిఎం పార్టీ వర్క్షాప్కు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. రూ.19 వేల కోట్లతో నిర్మిస్తున్న సీతారామ ప్రాజెక్ట్ లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భూములు నష్టపోయి కాల్వలకు తీశారు. అయినా జిల్లాకి నీరు ఇవ్వటానికి కావాల్సిన డిస్ట్రిబ్యూటర్ కెనాల్స్ నిర్మాణం చేపట్టకపోతే జిల్లా ఎండిపోయే అవకాశం ఉందన్నారు.
జిల్లా నుండి నీరు పోతున్నా జిల్లాకు చుక్క నీరు లేకపోతే ప్రజలు చూస్తూ ఊరుకోవాలా అని ఆయన ప్రశ్నించారు. జిల్లాకి అన్యాయం జరుగుతుంటే తెలంగాణ రైతు సంఘం చూస్తూ ఊరుకోదన్నారు. దీనిపై ఈ నెల 20వ తేదీ వరకు గ్రామ గ్రామాన సభలు పెట్టి ప్రజలను చైతన్యం చేయనున్నట్లు తెలిపారు. ఈ నెల 30వ తేదీ వరకు మండల స్థాయి ధర్నాలు నిర్వహించి, అనంతరం జాతాలు నిర్వహించి జిల్లా కలెక్టర్ కార్యాలయాన్ని దిగ్భందం చేయనున్నట్లు వెల్లడించారు. జిల్లాలో మొదటి డిజైన్ ప్రకారం మూడున్నర లక్షల ఎకరాలకు సాగునీరు ఇవ్వాల్సి ఉందన్నారు. కానీ ప్రభుత్వం డిజైన్ మార్చి 2 లక్షలకు కుదించిందని, ఆ రెండు లక్షలకు కూడా నేడు నీళ్లు వచ్చే అవకాశం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రభుత్వం ఇదేవిధంగా వ్యవహరిస్తే జిల్లా రైతాంగాన్ని చైతన్యవంతులు చేసి అధికార యంత్రాంగం దిగివచ్చేంత వరకు పోరాటాన్ని కొనసాగిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర నాయకులు మచ్చా వెంకటేశ్వర్లు, అన్నవరపు కనకయ్య, రైతు సంఘం జిల్లా కార్యదర్శి అన్నవరపు సత్యనారాయణ, నాయకులు కొనసా ధర్మ, దొడ్డ లక్ష్మీనారాయణ, కొండపోయిన వెంకటేశ్వర్లు, రవికుమార్, సత్యనారాయణ, కేశవరావు, తిరుపతిరావు, శ్రీకాంత్, శంకర్, వెంకటేశ్వర్లు, వినోద్, శ్రీనివాసరావు, వెంకట్రావు, రామారావు, శంకరయ్య, సమ్మక్క పాల్గొన్నారు.