దుమ్ముగూడెం: ఏజెన్సీలో విద్యార్థులు తెలుగుతో పాటు ఆంగ్లంలో పట్టు సాధించాలని జిల్లా విద్యాశాఖాధికారి సోమశేఖరశర్మ అన్నారు. శుక్రవారం మండల పరిధిలోని నర్సాపురం, ఒడ్డుగుంపు, అచ్యుతాపురం ప్రభుత్వ పాఠశాలలను సందర్శించారు. తొలుత నర్సాపురంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను సందర్శించి తరగతి గదుల్లో విద్యార్థులకు ఉపాధ్యాయులు బోధించే విధానాన్ని గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం 10వ తరగతి విద్యార్థులతో మాట్లాడుతూ తెలుగుభాషతో పాటు ఆంగ్లంలో పట్టు సాధించేలా నైపుణ్యత కలిగి ఉండాలని ఆయన చెప్పారు.
అనంతరం ఒడ్డుగుంపు, అచ్యుతాపురం పాఠశాలలను సందర్శించి పరిసరాలను పరిశీలించారు. విద్యాబోధన తీరును సమీక్షించి ఉపాధ్యాయులకు మెరుగైన బోధన అందించాలని సూచించారు. అనంతరం రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయుడిగా అవార్డు పొందిన ఏజే.ప్రభాకర్ను శాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట డీసీఈబీ చైర్మన్ ఎస్.మాధవరావు, ఎంఈవో సున్నం సమ్మయ్య, ఎంఆర్సీ ప్రభాకర్, ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, సీఆర్పీలు, విద్యార్థులు ఉన్నారు.