– బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి
– వీధి కుక్కల నివారణకు అధికారులు తక్షణమే చర్యలు చేపట్టాలి
– సీపీఐ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి ఎస్ కే సాబీర్ పాషా
లక్ష్మిదేవిపల్లి, మే 26 : కుక్కకాటుతో మహిళ మృతి చెందడం అత్యంత బాధాకరమని, బాధిత నిరుపేద కుటుంబాన్ని ప్రభుత్వం ఆర్థికంగా ఆదుకోవాలని సీపీఐ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి ఎస్ కే సాబీర్ పాషా డిమాండ్ చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవిపల్లి మండలం చాతకొండ ఎస్సీ కాలనీ, చాటివారిగూడెం గ్రామ పంచాయతీకి చెందిన మారె రాములమ్మ (50) అనే మహిళ కుక్కకాటుతో మృతి చెందగా, మంగళవారం ఆమె భౌతికకాయాన్ని సందర్శించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామాల్లో వీధి కుక్కల సంచారం విపరీతంగా పెరిగిపోయిందని, కుక్కకాటు వల్ల ప్రజల ప్రాణాలకు రక్షణ లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
తక్షణమే సంబంధిత అధికారులు స్పందించి వీధి కుక్కల నివారణకు పటిష్ట చర్యలు చేపట్టాలని, బాధిత కుటుంబానికి ప్రభుత్వం తగిన ఆర్థిక సహాయం అందించి అండగా నిలవాలని ఆయన కోరారు. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు మృతురాలి కుటుంబ సభ్యులను ఫోన్లో పరామర్శించి సంతాపాన్ని తెలిపారు. నివాళులర్పించిన వారిలో జ్యోతిబసు, పిచ్చయ్య, మిరియాల రాము, లక్ష్మయ్య, జాన్సన్, క్రాంతి, రాజేష్, కళ్యాణ్, జ్ఞానముత్యం ఉన్నారు.