– కొత్తగూడెం ఏరియా జీఎం ఎం.శాలెం రాజు సూచన
రుద్రంపూర్, ఫిబ్రవరి 06 : కొత్తగూడెం ఏరియాలో కాంట్రిబ్యూటరీ పోస్ట్ రిటైర్మెంట్ మెడికల్ స్కీమ్ (సిపిఆర్ఎంఎస్) ద్వారా వైద్య సేవలు పొందుతున్న మాజీ ఉద్యోగులు, వారి జీవిత భాగస్వాములు జీవన్ ప్రమాణ్ పోర్టల్లో తమ లైఫ్ సర్టిఫికెట్ను తప్పనిసరిగా పునరుద్ధరణ (అప్డేట్) చేసుకోవాలని కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ ఎం.శాలేం రాజు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. కొత్తగూడెం ఏరియాలో సుమారు 3 వేల మంది మాజీ ఉద్యోగులు, వారి జీవిత భాగస్వాములు సిపిఆర్ఎంఎస్ స్కీం ద్వారా కంపెనీ అందిస్తున్న వైద్య సేవలను పొందుతున్నారన్నారు. ఈ స్కీం కింద మెడికల్ కార్డు కలిగిన లబ్ధిదారులు ప్రతి సంవత్సరం నవంబర్ నెలలో జీవన్ ప్రమాణ్ పోర్టల్ ద్వారా లైఫ్ సర్టిఫికెట్ అప్డేట్ చేయించుకోవాల్సి ఉంటుందని తెలిపారు.
సిపిఆర్ఎంఎస్ పోర్టల్ డేటా ప్రకారం శుక్రవారం వరకు 389 మంది మాజీ ఉద్యోగులు, 513 మంది వారి జీవిత భాగస్వాములు ఇప్పటికీ లైఫ్ సర్టిఫికెట్లను అప్డేట్ చేయించుకోలేదని వెల్లడించారు. లైఫ్ సర్టిఫికెట్ పునరుద్ధరణ చేయని పక్షంలో అత్యవసర వైద్య పరిస్థితుల్లో మెడికల్ కార్డు ద్వారా చికిత్స పొందడంలో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందని జీఎం హెచ్చరించారు. అలాంటి సమస్యలు తలెత్తకుండా సిపిఆర్ఎంఎస్ స్కీం కింద మెడికల్ కార్డు కలిగిన మాజీ ఉద్యోగులు, వారి డిపెండెంట్ అయిన భార్యలు వెంటనే జీవన్ ప్రమాణ్ పోర్టల్లో తమ లైఫ్ సర్టిఫికెట్లను అప్డేట్ చేసుకోవాలన్నారు. లైఫ్ సర్టిఫికెట్ అప్డేషన్ పూర్తయితే మెడికల్ కార్డు ద్వారా వైద్య సేవలు ఎలాంటి అంతరాయం లేకుండా నిరంతరం పొందవచ్చని తెలిపారు.