ఇల్లెందు, ఏప్రిల్ 23 : ప్రజా సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఇల్లెందు స్థానిక కొత్త బస్టాండ్ సుందరయ్య స్థూపం నుండి గోవింద్ సెంటర్ మీదుగా ఎండీఓ, మున్సిపాలిటీ కార్యాలయాల ముందు సీపీఎం పార్టీ పట్టణ, మండల కమిటీ ఆధ్వర్యంలో బుధవారం ఖాళీ బిందెలతో ప్రదర్శన చేసి ధర్నా నిర్వహించారు. అనంతరం ఎంపీడీఓ దన్సింగ్, మున్సిపల్ మేనేజర్ అంకుశావళికి వినతిపత్రాలు అందజేశారు. అనంతరం పార్టీ నాయకుడు ఆలేటి కిరణ్కుమార్ అధ్యక్షతన జరిగిన సభలో పార్టీ జిల్లా కార్యదర్శి మచ్చా వెంకటేశ్వర్లు, పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యుడు ఏజే రమేశ్ మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందు ఆరు గ్యారంటీలను అమలు చేస్తామని హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత వాటి అమలుకు చిత్తశుద్ధి చూపకపోవడం సమంజసం కాదన్నారు.
సీఎస్పీ బస్తీ రాజీవ్నగర్ శివారు గుడిసె వాసులకు ఇంటి నంబర్లు, త్రాగునీరు, కరెంట్, ఇందిరమ్మ ఇళ్లు తదితర మౌలిక వసతులు కల్పించాలని డిమాండ్ చేశారు. ఇందిరమ్మ ఇళ్లు పైలెట్ ప్రాజెక్ట్ కింద పూబెల్లి ఎంపిక చేసి అక్కడ అర్హులైన వారు 10 మందిని ఈ పథకం లోకి తీసుకోకపోవడం సరైంది కాదన్నారు. పూబెల్లి గ్రామంలో దళారులు ఇసుక అక్రమ రవాణా చేస్తున్నట్లు దాన్ని నిలువరించి ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం కోసం ఉపయోగించాలని వారు కోరారు.
పూసపల్లి ఓసీ ఎక్సటెన్షన్ పేరుతో అక్కడ ఇండ్ల నిర్మాణాన్ని, చిన్న చిన్న మరమ్మతులు కూడా చేయకుండా సింగరేణి సెక్యూరిటీ సిబ్బంది ఇక్కడి ప్రజలను భయాందోళనకు గురిచేస్తుందని, నిర్వాసితులకు 2013 భూ నిర్వాసిత పునరావాస చట్టం ప్రకారం పరిహారం చెల్లించాలని వారు కోరారు. తిలక్ నగర్, మున్సిపాలిటీ పరిధిలోని అన్ని వార్డులకు మిషన్ భగీరథ నీరు సరఫరా చేయాలని, డ్రైనేజీ, పారిశుధ్య పనులు చేపట్టాలని, వీధి దీపాలు అమర్చాలని, మండలం, పట్టణంలో కోతులు, కుక్కలు, పందులు, దోమల బెడద నివారించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులు అబ్దుల్ నబి, తాళ్లూరి కృష్ణ, మన్యం మోహన్ రావు, సుల్తాన, ఆలేటి సంధ్య, మాదరపు వెంకటేశ్వర్లు, కోడెం బోస్, కళ్లేపల్లి మరియ, తాండ్ర కాంత, ఆర్బీజే రాజు, రాజమొగిలి, కడారి వెంకటమ్మ, వీరభద్రం, వెంకన్న, కోటమ్మ, నీలరాణి, మన్యం మమత, భద్రు పాల్గొన్నారు.
Yellandu : ప్రజా సమస్యలు పరిష్కరించాలని సీపీఎం నాయకుల ధర్నా