రుద్రంపూర్, ఫిబ్రవరి 10 : ఈ ఆర్థిక సంవత్సరంలో నిర్ధేశించిన బొగ్గు ఉత్పత్తి, ఓవర్ బర్డెన్ తొలగింపులో కొంత వెనకబడి ఉన్నందున ఈ ఫిబ్రవరి, మార్చి నెలలు ఈ ఆర్ధిక సంవత్సరం చివరి దశ నెలలు, ఈ ఆర్ధిక సంవత్సరంలో నిర్దేశించిన ఉత్పత్తి లక్ష్యాలను చేరుకొనుటకు ప్రతి ఒక్కరూ తమ వంతు కృషి చేయాలని, అప్పుడే నిర్దేశించిన లక్ష్యాలను చేరుకుంటామని కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ ఎం.శాలెం రాజు అన్నారు. మంగళవారం జరిగిన ఒక కార్యక్రమంలో ఈ నెల 12న తలపెట్టిన ఒక రోజు దేశ వ్యాప్త సమ్మెకు సంబందించి నిర్వహించిన సమీక్షలో భాగంగా కొత్తగూడెం ఏరియాలో పనిచేస్తున్న సింగరేణి కార్మికులు, కాంట్రాక్ట్ ఉద్యోగులకు కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ ఎం.శాలెం రాజు సమ్మెలో పాల్గొనవద్దని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా జీఎం మాట్లాడుతూ కొన్ని జాతీయ కార్మిక సంఘాలు వివిధ డిమాండ్లతో ఈ 12వ దేశవ్యాప్త సమ్మెకు పిలుపునిస్తూ, అందులో భాగంగా మన సింగరేణిలో కూడా ఒకరోజు సమ్మెకు పిలుపునిచ్చిన నేపథ్యంలో గమనించవలసిన విషయం ఏమిటంటే ఈ సమ్మె డిమాండ్లలో అత్యధికం సింగరేణి కార్మికులకు మాత్రమే సంబంధించినవి కావని, సింగరేణి యాజమాన్యం తీర్చగలిగేవి కూడా కావన్నారు.
సింగరేణి సంస్థ పరిధిలోని సమస్యలు ఏమైనా ఉంటే చర్చల ద్వారా పరిష్కరించుకునే అవకాశం ఉందన్నారు. అటువంటప్పుడు మన కార్మికులు ఈ సమ్మెలో పాల్గొనాల్సిన అవసరం లేదన్నారు. వివిధ కారణాల వల్ల వానాకాలంలో వర్షాల ప్రభావం వల్ల ఓపెన్ కాస్ట్ మైన్ లలో బొగ్గు ఉత్పత్తికి అంతరాయం కలిగిన విషయం తెలిసిందే అన్నారు. ఈ సమయంలో లక్ష్య సాధనకు ప్రతిరోజు సాధించే ఉత్పత్తి ఎంతో తోడ్పడుతుందన్నారు. నిరంతరాయంగా విద్యుత్ సరఫరా జరగడానికి బొగ్గు అవసరం కాబట్టి మన ఏరియాకు నిర్దేశించిన ఉత్పత్తి లక్ష్యాన్ని సాధించుటలో కృషి చేస్తూ ఒకరోజు సమ్మెలో పాల్గొనకుండా విధులకు హాజరు కావాలని ఆయన కోరారు.