– ఈఎస్ఐ డిస్పెన్సరీ వద్ద కాంట్రాక్ట్ కార్మికుల నిరసన
బూర్గంపహాడ్, మార్చి 17 : బూర్గంపహాడ్ మండల పరిధిలోని సారపాక గ్రామంలో ఈఎస్ఐ ఆస్పత్రిలో వైద్యం సకాలంలో అందక, కనీస సౌకర్యాల కొరతతో కార్మికులు తీవ్ర అవస్థలు ఎదుర్కొంటున్నారు. కార్మికులకు ఈఎస్ఐ ద్వారా 24 గంటలు వైద్యం అందించడంతో పాటు అవసరమైన మందులు కొరత లేకుండా అందుబాటులో ఉంచాలని కాంట్రాక్ట్ కార్మిక సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో మంగళవారం ఈఎస్ఐ ఎదుట నిరసన వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా కాంట్రాక్టు కార్మిక సంఘం జేఏసీ కన్వీనర్ పాటి సోమిరెడ్డి, కో-కన్వీనర్ సానికొమ్ము రామచంద్రారెడ్డి మాట్లాడుతూ.. డిస్పెన్సరీలో మందులు, వైద్యులు అందుబాటులో లేకపోవడంతో కార్మికులకు ఆరోగ్యపరంగా ఇబ్బందులు తలెత్తుతున్నాయన్నారు.
అత్యవసర సమయాల్లో వినియోగించాల్సిన అంబులెన్స్ సౌకర్యం కూడా లేకపోవడం దారుణమన్నారు. తక్షణమే ఉన్నతాధికారులు స్పందించి డిస్పెన్సరీలో మెరుగైన వైద్యసేవలు అందించేలా చూడాలని డిమాండ్ చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో కాంట్రాక్ట్ కార్మిక సంఘాల సభ్యులు ఉర్లగొండ వీరన్న, కందాల వెంకటరెడ్డి, జగదీష్, సీహెచ్ ఆంజనేయులు, కె.నాగయ్య, చుక్కపల్లి బాలాజీ, కాంట్రాక్ట్ కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.