కొత్తగూడెం: జిల్లాలోని నిరుద్యోగ యువతకు ప్రముఖ ప్రైవేటు కంపెనీల్లో ఉద్యోగ అవకాశాలు కల్పనకు ఈ నెల 6వ తేదీన కొత్తగూడెం ప్రగతి మైదానంలో ఉపాధి కల్పన శాఖ ఆధ్వర్యంలో మెగాజాబ్మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ దురిశెట్టి అనుదీప్ అన్నారు. సోమవారం కలెక్టరేట్ లో మెగా జాబ్మేళా నిర్వహణపై సమీక్షా సమావేశం నిర్వహించి జాబ్మేలా గోడపత్రికను ఆవిష్కరించారు. ఈ సమావేశంలో ఉపాధి,విద్యుత్,డీఆర్డీఏ,మున్సిపల్,వైద్య, డీపీవోలు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… జాబ్ మేళాకు దాదాపు 36 కంపెనీలు హాజరవుతున్నట్లు చెప్పారు. 8,10,ఇంటర్, డిగ్రీ, డిప్లొమా, పీజీ, సీఏ, ఇంజనీరింగ్, ఎంబీఏ, ఎంసీఏ, ఐటీఐ ఎలక్ట్రికల్, ఫిట్టర్, డీజిల్ మెకానిక్, మోటార్ మెకానిక్, వెల్డర్, సివిల్, కార్పెంటర్ శిక్షణ పొందిన వారికి ప్రైవేటు కంపెనీల్లో ఉద్యోగ అవకాశం కల్పించనున్నట్లు పేర్కొన్నారు.