– ఎల్నినో ప్రభావంతో అడుగంటిన భూగర్భ జలాలు
– నారుమడుల సంరక్షణకు మిర్చి రైతుల ప్రయాస
జూలూరుపాడు, జూలై 01 : ప్రకృతి కన్నెర్ర చేసినా, కాలం కలిసి రాకపోయినా అన్నదాత తన ఆరాటాన్ని, పోరాటాన్ని ఆపడం లేదు. ఒకవైపు ఎల్నినో ప్రభావంతో వర్షపాతం పూర్తిగా తగ్గిపోవడం, మరోవైపు బోరు బావుల్లో నీటి మట్టాలు అడుగంటి పోతుండడంతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండల రైతాంగం పంటను కాపాడుకునేందుకు అపర భగీరథ ప్రయత్నం చేస్తోంది. నర్సరీలలో మిర్చి నారు పెంచడానికి విపరీతమైన ఖర్చులు అవుతుండడంతో ఆ భారాన్ని భరించలేక రైతులు తమ పొలాల్లోనే నేరుగా నారుమడులు సిద్ధం చేసుకుంటున్నారు. మండలంలోని అనంతారం, గుండెపూడి, జూలూరుపాడు, వినోబా నగర్, పాపకొల్లు, బేతాళపాడు తదితర గ్రామాల్లోని మిర్చి రైతులు ప్రస్తుతం నారుమడులు పోస్తూ ఈ వినూత్న ప్రయోగానికి శ్రీకారం చుట్టారు.

పొలాల్లో చీరల ‘సింగిడి’
తీవ్రమైన ఎండలు, వాతావరణంలో వేడి కారణంగా విత్తనాలు మొలకెత్తే ముందే మడులలోని తేమ శాతం ఆరిపోకుండా ఉండేందుకు రైతులు పాత చీరలను కప్పుతున్నారు. ఈ పద్ధతి వల్ల భూమిలో తేమ ఆరిపోకుండా ఉండటంతో పాటు, విత్తనాల మొలక శాతం గరిష్టంగా వస్తుందని రైతులు నమ్మకంగా చెబుతున్నారు. పెట్టుబడులు పెరిగిపోయి, ఎరువులు, పురుగు మందుల ఖర్చులు అధికమై, సకాలంలో వర్షాలు కురవక నష్టాల్లో ఉన్న రైతులకు ఈ తక్కువ ఖర్చుతో కూడిన ఉపాయం ఎంతో మేలు చేస్తోందని రైతు పేర్కొంటున్నారు. ప్రస్తుతం పొలాల్లో వరుసగా పరచిన పాత చీరలు ఒక అద్భుతమైన రంగుల సింగిడిని తలపిస్తున్నాయి. రహదారుల గుండా వెళ్లే ప్రయాణికులను ఈ దృశ్యాలు ఎంతగానో ఆకట్టుకుంటూ ఆనందాన్ని కలిగిస్తున్నాయి.

పొలాల్లో చీరల ‘సింగిడి’
సంక్షోభంలోనూ సాగును ముందుకు తీసుకెళ్తున్న అన్నదాతల సృజనాత్మకతకు నిదర్శనంగా నిలుస్తున్నాయి. ఎల్నినో ప్రభావం వల్ల నీటి లభ్యత తగ్గుతున్న తరుణంలో నారుమడుల సంరక్షణకు, తక్కువ నీటితో సాగయ్యే ఆధునిక పద్ధతులపై వ్యవసాయ శాఖ అధికారులు రైతులకు క్షేత్రస్థాయిలో ఇలాంటి అవగాహన కల్పించాల్సి ఉంది. నర్సరీలలో అధిక ధరల భారాన్ని మోయలేక రైతులు పొలాల్లోనే నారు పోసుకుంటున్న తరుణంలో ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో చిన్న, సన్నకారు రైతులకు ప్రభుత్వం తరఫున విత్తన లేదా మల్చింగ్ షీట్లు సబ్సిడీలో అందజేయాలని రైతులు కోరుతున్నారు.