– భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్కు బీఆర్ఎస్ కార్పొరేటర్ సింధు తపస్వి వినతి
పాల్వంచ, జూలై 20 : భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గర్భిణీల మరణాలు, నవజాత శిశువుల మరణాలు, ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్య నిర్లక్ష్యం, అంబులెన్స్ సేవల వైఫల్యం, మాతా-శిశు ఆరోగ్య సేవల్లో తీవ్రమైన లోపాలపై సమగ్ర విచారణ జరిపి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ సోమవారం కలెక్టరేట్లో కొత్తగూడెం కార్పొరేషన్ పాల్వంచ 7వ డివిజన్ కార్పొరేటర్ సింధు తపస్వి కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు. జిల్లా వ్యాప్తంగా అత్యవసర వైద్య సేవలను బలోపేతం చేయాలని, ప్రాణాలను కాపాడాల్సిన ప్రభుత్వ ఆస్పత్రులు, నిర్లక్ష్యంతో ప్రాణాలను కోల్పోయే కేంద్రాలుగా మారడం అత్యంత బాధాకరం అన్నారు. ఒకే జిల్లాలో వరుసగా ఇలాంటి ఘటనలు జరగడం అనేది యాదృచ్ఛికం కాదనీ, ఇది వ్యవస్థాపరమైన వైఫల్యానికి, బాధ్యతారాహిత్యానికి, పరిపాలనా నిర్లక్ష్యానికి స్పష్టమైన నిదర్శనం అని ఆమె పేర్కొన్నారు
గుండాల మండలం – చాట్ల వనజ విషాదం (13 జూన్ 2026)
పురిటి నొప్పులతో ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లిన చాట్ల వనజకు వైద్యులు అందుబాటులో లేకపోవడంతో స్టాఫ్ నర్సు ప్రసవం నిర్వహించింది. ఆడ శిశువు మృతిగా జన్మించగా, తీవ్ర రక్తస్రావంతో బాధపడుతున్న వనజను ఖమ్మం తరలిస్తుండగా మార్గమధ్యంలో ఆమె మరణించింది. అనంతరం అంత్యక్రియల సమయంలో శస్త్ర చికిత్సలో ఉపయోగించే కత్తెర చితాభస్మంలో బయటపడటం వైద్య వ్యవస్థను తీవ్రంగా ప్రశ్నించే ఘటన. దీనిపై వైద్యాధికారిని సస్పెండ్ చేసినప్పటికీ, ఒక తల్లి ప్రాణాన్ని, ఒక పసికందు ప్రాణాన్ని తిరిగి తీసుకురా రాలేరని, అదేవిధంగా
పినపాక మండలం – కలివేటి సంధ్య మరణం (24 జూన్ 2026)
అమరారం గ్రామానికి చెందిన కలివేటి సంధ్యకు ప్రసవ నొప్పులు రావడంతో 108 అంబులెన్స్కు సమాచారం ఇచ్చినా సమయానికి రాలేదు. కుటుంబ సభ్యులు ఆటోలో ఆస్పత్రికి తీసుకెళ్లగా అక్కడ వైద్యులు లేకపోవడంతో మరో ఆసుపత్రికి తరలించే క్రమంలో మార్గమధ్యంలో ఆటోలోనే ప్రసవం జరిగింది. అనంతరం ఆమె మరణించింది. సకాలంలో అంబులెన్స్, వైద్యులు అందుబాటులో ఉంటే ఈ ప్రాణం నిలిచేదన్నారు.
రామవరం మాతా-శిశు సంరక్షణ కేంద్రం (15 జూలై 2026)
దమ్మపేట మండలం జగ్గారం గ్రామానికి చెందిన గర్భిణి భవానికి ఆస్పత్రిలో తగిన వైద్య సహాయం అందక, బెడ్ పక్కనే నిల్చుని ఉండగానే శిశువు కిందపడే పరిస్థితి ఏర్పడింది. ఈ ఘటన ప్రజలను తీవ్రంగా కలిచివేసింది. మాతా-శిశు ఆరోగ్య కేంద్రంలోనే ఇలాంటి దారుణ పరిస్థితులు ఉండడం అత్యంత ఆందోళనకర మైన విషయమన్నారు.
ఈ మూడు ఘటనలు వేర్వేరు సంఘటనలు కావనీ ఒకే సమస్యకు మూడు భయానక రూపాలనీ ముఖ్యంగా గుండాల, పినపాక వంటి మారుమూల ప్రాంతాల్లో వైద్యులు లేకపోవడం, స్టాఫ్ నర్సుల కొరత, 108 అంబులెన్స్ ఆలస్యం, అత్యవసర వైద్య పరికరాల లేమి, ప్రసూతి నిపుణుల కొరత, జిల్లా కేంద్రంలోని MCH ఆస్పత్రిలో కూడా పర్యవేక్షణ లోపించడం వంటి కారణాల వల్ల అమాయక గర్భిణీలు, నవజాత శిశువులు ప్రాణాలు కోల్పోతున్నారన్నారు. జిల్లాలో ఇటీవల జరిగిన అన్ని మాతా-శిశు మరణాలపై హై లెవల్ స్వతంత్ర విచారణ కమిటీ ఏర్పాటు చేయాలని, నిర్లక్ష్యం చేసిన వైద్యులు, సిబ్బంది, సంబంధిత అధికారులపై శాఖాపరమైన చర్యలతో పాటు చట్టపరమైన చర్యలు తీసుకోవాలన్నారు.
గుండాల, పినపాక, అశ్వారావుపేట, దమ్మపేట, చర్ల, మణుగూరు వంటి మారుమూల ప్రాంతాల్లో 24×7 వైద్య సేవలు అందుబాటులో ఉండేలా వైద్యులను నియమించాలని, ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రసూతి నిపుణులు, స్టాఫ్ నర్సులు, ల్యాబ్ టెక్నీషియన్లు, అవసరమైన మందులు, అత్యవసర పరికరాలు అందుబాటులో ఉంచాలని, 108 అంబులెన్స్ సేవలను బలోపేతం చేసి, స్పందన సమయంపై నిరంతర పర్యవేక్షణ చేపట్టాలనీ రామవరం MCH ఆస్పత్రిపై ప్రత్యేక ఆడిట్ నిర్వహించి, అవసరమైన వైద్యులు, సిబ్బంది, పరికరాలను తక్షణమే ఏర్పాటు చేయాలని, ప్రతి గర్భిణిని తప్పనిసరిగా ట్రాక్ చేసే జిల్లా స్థాయి ప్రత్యేక మానిటరింగ్ వ్యవస్థను ఏర్పాటు చేయాలని బాధిత కుటుంబాలకు తగిన ఆర్థిక సహాయం, కుటుంబ సభ్యులకు ఉపాధి కల్పనతో పాటు పూర్తి న్యాయం చేయాలని ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా జిల్లా వ్యాప్తంగా ప్రతి ఆస్పత్రిలో జవాబుదారీతనం అమలు చేయాలని ఆమె అధికారులను డిమాండ్ చేశారు.