లక్ష్మీదేవిపల్లి/ కొత్తగూడెం సింగరేణి/ మణుగూరు రూరల్/ ఇల్లెందు, జూన్ 21: మనిషి జీవన శైలిలో యోగాను భాగం చేసుకోవాలని భద్రాద్రి కలెక్టర్ అనుదీప్ సూచించారు. ప్రజలు ప్రతి రోజూ యోగా చేయడం వల్ల సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందవచ్చునని అనానరు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఆయూష్ శాఖ ఆధ్వర్యంలో భద్రాద్రి జిల్లా లక్ష్మీదేవిపల్లి మండలంలోని అటవీశాఖ సెంట్రల్ పార్కులో మంగళవారం నిర్వహించిన వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తొలుత గౌతమ బుద్ధుని చిత్రపటానికి పూలమాల వేశారు. అనంతరం అభ్యాసకులు, విద్యార్థులతో కలిసి పలు ఆసనాలు వేసి మెడిటేషన్ చేశారు. యోగా దినోత్సవంపై నిర్వహించిన వ్యాసరచన పోటీల విజేతలకు మెమెంటోలను అందించారు. అనంతరం పార్కు నుంచి ఇల్లెందు క్రాస్ రోడ్ వరకు జరిగిన యోగా ర్యాలీ నిర్వహించి ప్రయోజనాలను వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి రోజూ యోగా చేయడం ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతగుందని అన్నారు. అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, ఆయూష్ వైద్యుడు వెంకటేశ్వరరావు, డీఎంహెచ్వో దయానందస్వామి, ఆర్అండ్బీ ఈఈ భీమ్లా, జిల్లా ఇరిగేషన్ అధికారి అర్జున్, పీఆర్ ఈఈ సుధాకర్, డీపీఆర్వో మధుసూదన్రాజు, ఉద్యానశాఖ అధికారి మరియన్న, ఆర్డీవో స్వర్ణలత, కలెక్టరేట్ ఏవో గన్యా, తహసీల్దార్ నాగరాజు, ఎంపీడీవో రామారావు పాల్గొన్నారు.
ప్రభుత్వ సంస్థల ఆధ్వర్యంలో..
ఉమ్మడి జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల ఆధ్వర్యంలోనూ మంగళవారం యోగా దినోత్సవాన్ని నిర్వహించారు. పలు ఆసనాలు వేసి వాటి వల్ల ఆరోగ్యానికి కలిగే ఉపయోగాలను వివరించారు. కొత్తగూడెం ప్రకాశం స్టేడియం మైదానంలో సింగరేణి ఆధ్వర్యంలో 8వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని నిర్వహించారు. ఆరోగ్య పరిరక్షణకు యోగా సాధన ఎంతగానో దోహదపడుతుందని సింగరేణి డైరెక్టర్ (ఆపరేషన్స్) చంద్రశేఖర్ అన్నారు. జీఎం పర్సనల్ కే.బసవయ్య, ఆనందరావు తదితరులు పాల్గొన్నారు. ఏరియాలోని అన్ని గనుల్లో డిపార్ట్మెంట్లు, పీకే ఓసీ, కేపీయూజీ మైనుల్లో యోగాసనాలు వేశారు. జీఎం కార్యాలయంలో జరిగిన యోగా కార్యక్రమంలో ఏరియా ఇన్చార్జి జీఎం నాగేశ్వరరావు మాట్లాడారు. ఇల్లెందు ఏరియాలోనూ యోగా డే దినోత్సవాన్ని నిర్వహించారు. జీఎం కార్యాలయంలో ఏరియా జీఎం శాలెంరాజు ఆధ్వర్యంలో యోగా అభ్యాస కార్యక్రమాలు నిర్వహించారు.