– భద్రాద్రి కొత్తగూడెం, మార్చి 29, (నమస్తే తెలంగాణ):మారుమూల ఏజెన్సీ ప్రాంతాలకు మెరుగైన వైద్యసేవలు అందించడంతోపాటు గిరిజన బిడ్డలకు వైద్యవిద్యను చేరువ చేసేందుకు సీఎం కేసీఆర్ మెడికల్ కాలేజీని మంజూరు చేశారు. ఇందుకోసం రూ.500 కోట్లు కేటాయిం చడంతో వైద్య కళాశాల పనులు చకచకా జరుగుతున్నాయి. వచ్చే విద్యాసంవత్సరం నుంచి ఇక్కడ విద్యార్థులకు తరగతులు బోధించేందుకు సర్వం సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే కళాశాలకు ప్రిన్సిపల్తోపాటు ప్రొఫెసర్లు, ట్యూటర్స్ను నియమించారు. వారానికి ఒకసారి కలెక్టర్ అనుదీప్ కళాశాల నిర్మాణ పనులను పర్యవేక్షిస్తుండడంతో పనులు వేగవంతంగా జరుగుతున్నాయి.
25 ఎకరాల విస్తీరణంలో
పాల్వంచ కొత్తగూడెం పట్టణాల పరిధిలో కేఎస్ఎం కాలేజీ ఆవరణలో 25 ఎకరాలు స్థలంలో మెడికల్, నర్సింగ్ కళాశాల పనులు చేపట్టారు. ఇప్పటికే మంత్రులు హరీష్రావు, పువ్వాడ అజయ్కుమార్ మెడికల్ కాలేజీ నిర్మాణ పనులను పరిశీలించి త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. ఈ విద్యాసంవత్సరం నుంచి ఇక్కడే విద్యార్థులకు బోధన జరిగేలా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. దీంతో మెడికల్ కాలేజీ నిర్మాణ పనులను కలెక్టర్ అనుదీప్ నిరంతరం పర్యవేక్షణ చేస్తున్నారు. ఇంటి నుంచి కలెక్టరేట్కు వెళ్లే క్రమంలో నిర్మాణ పనులు పరిశీలిస్తున్నారు. దీంతో నత్తనడకన సాగుతున్న పనుల్లో వేగం పుంజుకున్నది. ఏప్రిల్లో పనులు పూర్తి చేసి మెడికల్ విద్యార్థులకు ఇక్కడి నుంచే తరగతులు నిర్వహించనున్నారు. మొదటి సంవత్సరం విద్యార్థుల కోసం పాల్వంచ సమీపంలో ప్రైవేటు హాస్టల్ను సిద్ధం చేస్తున్నారు. ఈ కాలేజీకి మొత్తం 150 సీట్లు కేటాయించారు. కౌన్సిలింగ్లో సీటు సాధించిన విద్యార్థులు ఇందులో ప్రవేశం పొందనున్నారు.
రూ.500 కోట్లతో పనులు
ప్రతి పల్లెకూ కార్పొరేట్స్థాయి వైద్యం అందాలి. ఆ లక్ష్యం నెరవేరాలంటే మారుమూల ప్రాంతాలకు వైద్యకళాశాల అవసరం. అప్పుడే అన్ని రకాల వైద్యులు ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉంటారు. ఇక్కడి జనం వైద్యం కోసం ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం ఉండదు. మారుమూల ప్రాంతాల నుంచి వచ్చినవారికీ అధునాతన వైద్యం అందాలి. ప్రాణాప్రాయ స్థితిలో ఉన్నవారు సురక్షితంగా ఉండాలనే లక్ష్యంతో సీఎం కేసీఆర్ ముందుతరాల వారి కోసం కొత్త జిల్లాలకూ మెడికల్ కాలేజీను మంజూరు చేయించారు. రూ.500 కోట్లు కేటాయించారు. కేవలం మొదటి సంత్సరంలోనే కాకుండా రెండో ఏడాదికీ నిధుల కేటాయింపు జరిగింది. మెడికల్ కాలేజీకి సంబంధించి అవసరమైన ఉద్యోగులను నియమించారు.
కలెక్టర్ చొరవతో పనుల్లో వేగం
కలెక్టర్ అనుదీప్ చొరవతో పనులు వేగవంతంగా జరుగుతున్నాయి. నీట్లో ఎంపికైన విద్యార్థులకు తరగతులు నిర్వహిస్తాం. హాస్టల్ వసతి కూడా ఉంది. ప్రస్తుతం ప్రైవేటు వసతి సౌకర్యాన్ని కల్పిస్తున్నాం. మెరుగైన వైద్యసేవలు ఏజెన్సీపాంత్రాల వారికి లభిస్తాయి. మెడికల్ కాలేజీ మంజూరు కావడం అదృష్టంగా భావిస్తున్నా.
– డాక్టర్ లక్ష్మణ్రావు, మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్