భద్రాద్రి కొత్తగూడెం, డిసెంబర్ 18 (నమస్తే తెలంగాణ) : అటవీ, రెవెన్యూ భూముల సమస్యలకు త్వరలోనే శాశ్వత పరిష్కారం లభించనున్నదని జడ్పీ చైర్మన్ కోరం కనకయ్య అన్నారు. ఆదివారం జడ్పీ కార్యాలయంలో అటవీ, స్త్రీ శిశు, వికలాంగుల సంక్షేమ శాఖ, సమీకృత గిరిజన ఇంజినీరింగ్, రోడ్లు భవనాలు, పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ విభాగం అంశాలపై 16వ జడ్పీ సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అర్హులకు పోడు పట్టాల జారీ విషయంలో జడ్పీటీసీ సభ్యుల సూచనలు పరిగణలోకి తీసుకొని ప్రత్యేక సమావేశం నిర్వహిస్తామని తెలిపారు. అర్హులందరికీ పోడు పట్టాలు జారీ చేయాలని ఈ సమావేశంలో తీర్మానించారు. 19మంది జడ్పీటీసీ సభ్యులకు రూములు కేటాయించగా లక్ష్మీదేవిపల్లి, సుజాతనగర్ జడ్పీటీసీలకు ఎందుకు గది కేటాయించలేదని, ఎంపీడీవో కార్యాలయాల్లో ప్రత్యేకంగా గదులు కేటాయించాలని సీఈవోకు సూచించారు. బడిబయట పిల్లలను బడులకు రప్పించే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. ఇతర రాష్ర్టాల నుంచి వచ్చిన కూలీల పిల్లలను బడుల్లో చేర్పించుకోవడం లేదని జడ్పీటీసీలు లేవనెత్తిన అంశాలన్నీ పరిగణలోకి తీసుకొని విద్యార్థులకు బడుల్లో చేర్పించే విధంగా చర్యలు తీసుకోవాలని డీఈవోను ఆదేశించారు. ఇల్లెందు ఎమ్మెల్యే హరిప్రియానాయక్ మాట్లాడుతూ ఇల్లెందులో గిరిజన భవన్ నిరుపయోగంగా ఉందని, వినియోగంలోకి తేవాలని కోరారు. పోడు పట్టాల సమస్య పరిష్కారానికి గ్రామసభలు ద్వారా తీసుకున్న క్లెయిమ్స్లో ఎఫ్ఆర్సీ కమిటీలు విచారణ నిర్వహించి గ్రామసభలు పెట్టారని, ఆ సమయంలో కొందరు అందుబాటులో లేరని, వారికి మరో అవకాశం కల్పించాలని అన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, జడ్పీ సీఈవో విద్యాలత, జడ్పీ వైస్ చైర్మన్ కంచర్ల చంద్రశేఖర్రావు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ దిండిగాల రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.