కొత్తగూడెం క్రైం, నవంబర్ 5: కొత్తగూడెంలోని రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాలు, రైటర్ బస్తీ, గొల్లగూడెం, న్యూగొల్లగూడెం, బూడిదగడ్డ, గాజులరాజం బస్తీ, పాత కొత్తగూడెం, రామాటాకీస్ ఏరియా, సన్యాసి బస్తీ, బస్టాండ్ ఏరియా, రామవరం, గణేశ్ టెంపుల్ ఏరియా, చుంచుపల్లి, విద్యాగనర్, రుద్రంపూర్, ధన్బాద్, 2-ఇైంక్లెన్ ఏరియా, త్రీ ఇైంక్లెన్ ఏరియా, లక్ష్మీదేవిపల్లి, చాతకొండ క్రాస్ రోడ్డు, ఇల్లెందు క్రాస్ రోడ్డు, రేగళ్ల క్రాస్ రోడ్డు, పాలకేంద్ర ఏరియా, సింగరేణి గనుల పరిసరాలు, పాల్వంచ పరిసర ప్రాంతాల్లో ఇటీవల కొన్ని అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకున్నాయి. మద్యం మత్తులో ఓ యువకుడు తన స్నేహితుడిపై దాడి చేసి హతమార్చాడు. అర్ధరాత్రి ఆకతాయిలు వాహనాలను ధ్వంసం చేశారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించారు. యువకులు గంజాయితో పాటు ఇతర మాదక ద్రవ్యాల బారిన పడ్డారు. ఇది అదునుగా తీసుకున్న అక్రమార్కులు గంజాయి విక్రయాలకు తెరలేపారు. పారిశ్రామిక, వ్యాపార రంగాల్లో దినదినాభివృద్ధి చెందుతున్న జిల్లాకు అపఖ్యాతి తెస్తున్నారు. ఈవిషయాన్ని సీరియస్గా తీసుకున్న ఎస్పీ డాక్టర్ వినీత్ నేర నియంత్రణకు చర్యలు చేపట్టారు. విజిబుల్ పోలీసింగ్కు ప్రాధాన్యం ఇస్తున్నారు.
పటిష్ట చర్యలు..
శాంతిభద్రతలను గాడిలో పెట్టేందుకు ఎస్పీ డాక్టర్ వినీత్ గంగన్న తనదైన శైలిలో ప్రణాళికలు అమలు చేస్తున్నారు. ఇటీవల జరిగిన అవాంఛనీయ ఘటనలను సీరియస్గా తీసుకున్నారు. విజిబుల్ పోలీసింగ్ను పటిష్టపరిచారు. ఎస్పీగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ఉత్తమ సేవలు అందిస్తున్నారు. గోదావరి వరదల సమయంలో ముంపు బాధితులకు అండగా నిలిచారు. పోలీసులను అప్రమత్తం చేసి సహాయక చర్యలు చేపట్టారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా గణేశ్, శ్రీదేవీ శరన్నవరాత్రి వేడుకలు సజావుగా జరిగేలా చర్యలు చేపట్టారు. రౌడీషీటర్లు, ఆకతాయిల ఆగడాలకు అడ్డుకట్ట వేశారు. ఇప్పటికే ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో రోజుకుఒక పోలీస్ను పర్యవేక్షణకు కేటాయిస్తున్నారు. పెట్రోలింగ్ సిబ్బందితో పాటు వీరు సాయంత్రం 6గంటల నుంచి రాత్రి దాదాపు 11గంటల వరకు పలు ప్రాంతాలను పర్యవేక్షిస్తారు.
నేరాల నియంత్రణకు ‘కార్డన్ అండ్ సెర్చ్’
నేర నియంత్రణలో భాగంగా పోలీస్ అధికారులు జిల్లావ్యాప్తంగా ‘కార్డన్ అండ్ సెర్చ్’ నిర్వహిస్తున్నారు. నేరాలు ఎక్కువగా జరిగే ప్రాంతాల్లో ఆకస్మికంగా తనిఖీలు చేపడుతున్నారు. ఆ ప్రాంతాన్ని చక్రబంధనం చేసి అనుమానిత వ్యక్తులను విచారిస్తున్నారు. వాహన పత్రాలు లేని వాహనాలను స్వాధీనం చేసుకుంటున్నారు. సరైన సమాధానాలు, పొంతన లేని సమాధానాలు ఇచ్చే వారి ఇళ్లలో సోదాలు చేస్తున్నారు. ప్రజలకు ‘మేమున్నాం..’ అనే భరోసా కల్పిస్తున్నారు.
రాత్రి 10 గంటల నుంచే పెట్రోలింగ్..
నేర నియంత్రణకు పోలీసులు రాత్రి 10 గంటల నుంచే పెట్రోలింగ్ నిర్వహిస్తున్నారు. ఆకతాయిల ఆగడాలకు అడ్డుకట్ట వేస్తున్నారు. చోరీలు, గంజాయి రవాణాను నివారిస్తున్నారు. అనవసరంగా బయటకు వచ్చి బైక్లపై తిరుగుతున్న యువకులకు కౌన్సిలింగ్ ఇస్తున్నారు. మద్యం తాగి వాహనాలు నడుపుతున్న వారిపై కేసులు నమోదు చేస్తున్నారు. చలాన్లు విధిస్తున్నారు. ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో విజుబుల్ పోలీసింగ్ చేపడుతున్నారు.
సమస్యల పరిష్కారానికి ‘డయల్ యువర్ ఎస్పీ’
ప్రజలకు అండగా నిలవాలన్న సంకల్పంతో ఎస్పీ డాక్టర్ వినీత్ గంగన్న ‘డయల్ యువర్ ఎస్పీ’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ప్రతి నెలా 1వ తేదీన 08744-24366 ల్యాండ్ నంబరుకి కాల్ చేసి ప్రజలు తమ సమస్యలను ఎస్పీకి తెలియజేయవచ్చు. ఎస్పీ తక్షణం స్పందించి ప్రజల సమస్యలకు పరిష్కారం చూపుతున్నారు.