కొత్తగూడెం ఎడ్యుకేషన్, అక్టోబర్ 20: అన్నిదానాల్లోకెల్లా విద్యాదానం మిన్న. ఒకరికి విద్య అందిస్తే అది పది మందికి వెలుగు. ఉమ్మడి పాలకులు విద్యారంగాన్ని నిర్వీర్యం చేశారు. స్వరాష్ట్రం వచ్చిన తర్వాత సీఎం కేసీఆర్ విద్యావ్యవస్థను పటిష్టం చేసేందుకు ప్రణాళికలు అమలు చేస్తున్నారు. దీనిలో భాగంగా ప్రభుత్వ పాఠశాలలు, గురుకులాలు, కేజీబీవీలనే కాక సంక్షేమ హాస్టళ్లను బలోపేతం చేస్తున్నారు. ఎస్సీ హాస్టళ్లలో అభివృద్ధి పనులకు ప్రభుత్వం రూ.1.50 కోట్ల క్రూజువల్ వెల్ఫేర్ రిలీఫ్ నిధులు విడుదల చేసింది. నిధులతో అధికారులు జిల్లాలోని 30 షెడ్యూల్డ్ కులాల వసతి గృహాలను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. హాస్టళ్లలో ఎలక్ట్రికల్, శానిటేషన్, ప్లంబింగ్, వాటర్ సైప్లె పనులను పూర్తి చేశారు.
పెరిగిన అడ్మీషన్లు..
జిల్లావ్యాప్తంగా ఉన్న ఎస్సీ హాస్టళ్లలో ఏటా సుమారు 300 మంది అడ్మీషన్లు పొందుతారు. ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకుని వసతి గృహాలను ఆధనీకరించడంతో అడ్మీషన్లు గణనీయంగా పెరిగాయి. ఈ ఏడాది ఏకంగా 650 మంది కొత్తగా అడ్మీషన్లు తీసుకున్నారు. అధికారులు ప్రతి హాస్టల్లో సీడబ్ల్యూఆర్ఎఫ్ నిధుల కింద ఎల్ఈడీ లైట్లు ఏర్పాటు చేయించారు. విద్యార్థుల ఆరోగ్యంపై శ్రద్ధ వహిస్తున్నారు. విద్యార్థులను దోమల బారి నుంచి కాపాడేందుకు కిటికీలు, తలుపులకు దోమతెరలు ఏర్పాటు చేయించారు. బంకర్బెడ్లు సిద్ధం చేయించారు. దోమతెరలు అందజేశారు. ప్రస్తుతం శీతాకాలం ప్రవేశించిన నేపథ్యలంలో విద్యార్థులకు బ్లాంకెట్స్, బెడ్షీట్లు అందించారు. నీటి వసతి లేనిచోట బోర్లు వేయించారు.
తెలంగాణ సంస్కృతిని చాటిచెప్పేలా పెయింటింగ్స్..
తెలంగాణ సంస్కృతిని చాటిచెప్పే విధంగా అధికారులు వసతి హాస్టళ్లలోని గోడలపై వాల్ పెయింటింగ్స్ వేయించారు. ఖమ్మానికి చెందిన ఓ పెయింటింగ్ సంస్థ పనులు చేపట్టి బతుకమ్మ, పల్లె సుద్దులు, శ్రమైక జీవన సౌందర్యం, తెలంగాణ చరిత్ర, పల్లెటూళ్ల అందాలు, పోరాట యోధుల చిత్రాలు గీయిస్తున్నది. 90శాతం హాస్టళ్లలో వాల్ పెయింటింగ్స్ పూర్తయ్యాయి. రెండు మూడు రోజుల్లో అన్ని వసతి గృహాల్లో పనులు పూర్తవవుతాయి.
పనులపై సంతృప్తి
ఇటీవల కలెక్టర్ దురిశెట్టి అనుదీప్ దుమ్ముగూడెంలోని బాలుర వసతి గృహాన్ని సందర్శించారు. గృహంలో కల్పిస్తున్న వసతులను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఎస్సీ వెల్ఫేర్ కమిషనర్ యోగితారాణి ఇటీవల భద్రాచలంలోని బాలికల వసతి గృహాన్ని సందర్శించారు. క్రూజువల్ వెల్ఫేర్ ఫండ్తో చేపట్టిన పనులను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. వసతి గృహంలో పెంచుతున్న కూరగాయల తోటను చూసి వార్డెన్, సిబ్బందిని అభినందించారు.