భద్రాద్రి కొత్తగూడెం, జూలై 31 (నమస్తే తెలంగాణ): వానకాలం వచ్చేసింది. సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున రాష్ట్ర వైద్యారోగ్యశాఖ అప్రమత్తమైంది. ముఖ్యంగా గోదావరి ముంపు ప్రాంతాల్లో వ్యాధులు ప్రబలే అవకాశం ఎక్కువ ఉన్నందున ఆయా ప్రాంతాల్లో వైద్యశిబిరాలు నిర్వహించింది. పంచాయతీ సిబ్బంది క్రమం తప్పకుండా పారిశుధ్య చర్యలు చేపడుతున్నారు. వీధుల్లో బ్లీచింగ్ చల్లుతున్నారు. నిల్వ ఉన్న నీటిలో ఆయిల్ బాల్స్ వేస్తున్నారు. దోమల నివారణకు ఫాగింగ్ చేస్తున్నారు. ప్రతి శుక్రవారం డ్రై డే చేపడుతున్నారు.
వైద్యపరీక్షలు ఇలా..
జిల్లా వైద్యారోగ్యశాఖ ఏడు ముంపు మండలాల్లో 74 గ్రామా ల్లో వైద్యశిబిరాలు ఏర్పాటు చేసింది. 58,000 ర్యాపిడ్ టెస్టులు చేసింది. డెంగీ కేసులు నమోదయ్యే అవకాశం ఉన్నందున 300 కిట్లు అందుబా టులో ఉంచి ఎలీసా టెస్టులు చేస్తున్నది. ఇప్పటివరకు జిల్లాలో 156 మలేరియా, 39 మందికి డెంగీ నిర్ధారణ అయింది. కేసుల సంఖ్య పెరగ కుండా వైద్యసిబ్బంది జాగ్ర త్త వహిస్తున్నారు. ఇప్పటికే 125 గ్రామాల్లో దోమల మందును పిచికారీ చేయించారు. 215 గ్రామాల్లో జ్వరపీడితు ల సర్వే పూర్తి చేశారు. అవసరమైన వారికి మెడిసిన్ పంపిణీ చేస్తున్నారు.
క్షేత్రస్థాయిలోకి యంత్రాంగం..
జిల్లాలో సీజనల్ వ్యాధుల నివారణపై కలెక్టర్ అనుదీప్ ప్రత్యేక దృష్టి సారించారు. మండల యూనిట్గా ఎంపీడీవో, తహసీల్దార్, ఎంపీవో, పంచాయతీ సెక్రటరీలు, ప్రజారోగ్య సంరక్షణకు పీహెచ్సీల పరిధిలోని వైద్యులు, ఏఎన్ఎంలు, ఆశవర్కర్లతో బృందాలు ఏర్పాటు చేశారు. బృందాలు డీపీవో, డీఎంహెచ్వో నేతృత్వంలో పారిశుధ్య పనులను పర్యవేక్షిస్తున్నారు.
పరిసరాల పరిశుభ్రత ముఖ్యం..
ప్రజలు సీజనల్ వ్యాధులపై అవగాహన పెంచుకోవాలి. ఇళ్ల ముందు ఉన్న గుంతలను పూడ్చి వేయాలి. టైర్లు, పాత్రల్లో నీరు నిల్వ లేకుండా చూసుకోవాలి. పరిసరాలను ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలి. దోమ లు ఇండ్లలోకి రాకుండా కిటికీలు, తలుపులు మూసి ఉంచాలి. జెట్ కాయిల్స్ ఉపయోగించాలి. ప్రతిఒక్కరూ వ్యక్తిగత శుభ్రత పాటించాలి. నీటిని కా చి చల్లార్చి తాగాలి. నిల్వ ఉన్న పదార్థాలు తినకూడదు. తాగునీరు కలుషితమై డయేరియా వ్యాప్తికి అవకాశం ఉన్నందున వేడి వేడి పదార్థాలు తీసుకోవాలి.
ఇంటింటి సర్వే చేస్తున్నాం..
వానకాలం సీజన్ వ్యాధులు ప్రబలే కాలం. ప్రజలు అప్రమత్తంగా ఉండి పరిసరాలను ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలి. వైద్యారోగ్యశాఖ జ్వర పీడితుల సర్వే చేస్తున్నది. బాధితులను గుర్తించి మెడిసిన్ అందిస్తున్నాం. దోమల నివారణకు గ్రామగ్రామన స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నాం. ఏఎన్ఎంలు, ఆశ కార్యకర్తలు, సూపర్వైజర్లు ప్రతిరోజు గ్రామాల్లో పర్యటించి ప్రజలకు ఆరోగ్య సంరక్షణపై అవగాహన కల్పిస్తున్నారు. ప్రతీ పీహెచ్సీ పరిధిలో ఆరోగ్య శిబిరాలు ఏర్పాటు చేశాం.
– డాక్టర్ దయానందస్వామి, డీఎంహెచ్వో, కొత్తగూడెం
పక్కాగా పారిశుధ్య పనులు..
గ్రామాల్లో ముమ్మరంగా పారిశుధ్య చర్యలు చేపడుతున్నాం. సీజనల్ వ్యాధుల నివారణకు ప్రత్యేక కార్యాచరణ అమలు చేస్తున్నాం. ముంపు ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించి ఇప్పటికే వేలాది టన్నుల చెత్తాచెదారాన్ని తొలగించాం. కలెక్టర్ అనుదీప్ పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి సారించారు. నిత్యం పనులను పర్యవేక్షిస్తున్నారు.
– రమాకాంత్, డీపీవో, కొత్తగూడెం