భద్రాద్రి కొత్తగూడెం, జూలై 27 (నమస్తే తెలంగాణ): గోదావరి ఉప్పొంగింది. జల విలయం సృష్టించింది. పల్లెలను నదినీ ఒక్కటి చేసింది. ప్రజలను నిరాశ్రయులను చేసి గానీ గోదారమ్మ శాంతించలేదు. వరదల అనంతరం వేలాది మంది ఇంటి సామగ్రి, జీవాలను పోగొట్టుకున్నారు. పూరి గుడిసెల్లో నివసించే వారు పూర్తిగా నిరాశ్రయులయ్యారు. వారిని ఆదుకోవడానికి ఎంతోమంది సహృదయులు ముందుకు వస్తున్నారు. వీరిలో రాజకీయ పార్టీల నాయకులు, ప్రజాప్రతినిధులు, వ్యాపారవేత్తలు, స్వచ్ఛంద సేవా ప్రతినిధులు, ఉద్యోగులు ఉన్నారు. భద్రాద్రి జిల్లాలో ముంపునకు గురైన ఏడు మండలాల ప్రజలను ఆదుకుంటున్నారు. నిత్యావసర సరకులు అందజేసి వారి కడుపు నింపుతున్నారు.
రేగా విష్ణు ట్రస్ట్ ఆధ్వర్యంలో..
రేగా విష్ణు మెమోరియల్ ట్రస్ట్ ద్వారా ప్రభుత్వ విప్ రేగా కాంతారావు అశ్వాపురం, బూర్గంపాడు, మణుగూరు, కరకగూడెం మండలాలకు చెందిన వరద బాధితులకు అండగా నిలిచి సాయం అందిస్తున్నారు. ఐటీసీ ద్వారా బాధితులకు నిత్యావసర సరకులు అందించారు. వరదల సమయంలోనూ నిత్యం వారి మధ్య పర్యటిస్తూ వసతి, భోజన సౌకర్యలు కల్పించారు.
మాజీ ఎంపీ పొంగులేటి నిత్యావసర కిట్లు..
మాజీ ఎంపీప పొంగులేటి శ్రీనివాసరెడ్డి వరద బాదితులకు అండగా నిలుస్తున్నారు. భద్రాచలం, పినపాక నియోజకవర్గాలకు చెందిన వరద బాధితులకు పీఎస్ఆర్ ట్రస్ట్ ద్వారా నిత్యావసరాల కిట్లు పంపిణీ చేశారు. భద్రాచలం నియోజకవర్గంలో టీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్ చార్జి తెల్లం వెంకట్రావు ఆధ్వర్యంలో నాయకులు దుమ్ముగూడం,చర్ల మండలాలకు చెందిన ముంపు బాధితులకు సాయం అందించారు.
ఖమ్మం నుంచి టీఆర్ఎస్ నేతల సాయం..
మంత్రి పువ్వాడ అజయ్కుమార్ పిలుపుతో ఖమ్మానికి చెందిన టీఆర్ఎస్ నాయకులు సాయం అందించేందుకు ముందుకువచ్చారు. నగరపాలక సంస్థ మేయర్ నీరజ ఆధ్వర్యంలో వారు వరద బాధితులకు నిత్యావసరాలు అందజేశారు. మణుగూరు నుంచి ఎస్కేటీ సభ్యులు, సాయిఅంజన బజాజ్ సంస్థ ప్రతినిధులు, టీఆర్ఎస్ నాయకుడు అలీంఖాన్ తదితరులు బాధితులను అదుకున్నారు. ప్రభుత్వ ఉద్యోగులు దుమ్ముగూడెం మండలంలో ముంపునకు గురైన వారికి నిత్యావసరాలు పంపిణీ చేశారు.
ఎమ్మెల్యే సండ్ర దాతృత్వం..
వరద బాధితుల సమస్యలు తెలుసుకుని ఆదుకోవడానికి ఎంతోమంది ముందుకు వస్తున్నారు. చేతనైన సాయం చేస్తున్నారు. మరి మూగజీవాల పరిస్థితి ఏమిటి ? అవి ఎవరితో చెప్పుకుంటాయి? వరదలతో పంటలు, బీళ్లు నీట మునగడంతో ప్రస్తుతం ఆయా ప్రాంతాలు బురదలోనే ఉన్నాయి. పశువులకు మేత దొరకని దుస్థితి. పరిస్థితిని అర్థం చేసుకున్న సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య లారీల కొద్ది పశుగ్రాసాన్ని జీవాల యజమానులకు అందించారు. అంతేకాదు ఆయన వందలాది మంది వరద బాధితులకు నిత్యావసరాలూ అందజేశారు.
దాతల చేతనైన సాయం..
ముంపు ప్రాంతాల్లో సర్వం కోల్పోయిన వరద బాధితులకు సాయం చేయడానికి ఎంతోమంది దాతలు ముందుకు వస్తున్నారు. వీరిలో వ్యాపారులు, మజీద్ కమిటీ సభ్యులు, సత్యసాయి ట్రస్ట్ నిర్వాహ కులు, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ప్రతినిధులు, మార్కెటింగ్ శాఖలతో పాటు ప్రభుత్వ ఉద్యోగులు,రియల్టర్లు ఉన్నారు.