భద్రాద్రి కొత్తగూడెం, జూలై 21 (నమస్తే తెలంగాణ):ముంచుకొచ్చిన వరద ముప్పునకు పరిహారం పక్కాగా అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సమాయత్తమైంది. అందుకోసం ప్రత్యేక అధికారులను నియమించింది. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన రూ.10 వేలు సాయం ప్రతి కుటుంబానికి అందేలా రెవెన్యూ అధికారులు ఇంటింటి సర్వే చేపట్టారు. ముంపులో ఉన్న ప్రతి కుటుంబానికి పరిహారం అందాలి.. పునరావాసంలో ఉన్నా.. లేకున్నా, ఇళ్లు ఖాళీ చేసి బంధువుల వద్దకు వెళ్లినా, పునరావాసానికి ఆలస్యంగా వచ్చినా వారందరూ ముంపు బాధితులే. ప్రభుత్వం ప్రకటించిన పరిహారం వారికి అందాల్సిందే.. అందుకే ఇంటింటి సర్వేలో డివిజన్ స్థాయి అధికారులను నియమించారు. ఇప్పటికే ఏడు మంపు మండలాల్లో 12,277 ఇండ్లు నీటమునగగా 22వేల మంది కుటుంబాలను పునరావాసాలకు తరలించారు. వీరిలో ఇంకా ఎంతమంది బంధువుల ఇళ్లల్లో ఆశ్రయం పొందారు.. నీరు రాకపోయినా ముందుగానే అధికారులు ఖాళీ చేయమని చెప్పిన కుటుంబాల వివరాలు పక్కాగా సేకరించేందుకు సర్వే టీంలు సిద్ధమయ్యాయి. 25 సర్వే బృందాలు ముంపు మండలాల్లో జల్లెడ పడుతున్నాయి.
జిల్లాలోని ముంపు బాధితులకు సేవలతోపాటు పక్కాగా పరిహారం అందించేందుకు చేస్తున్న సర్వేలో డివిజన్ స్థాయి అధికారులు కీలకప్రాత వహిస్తున్నారు. సర్వే చేస్తున్న ప్రాంతాల్లో కలెక్టర్లు సైతం మరోసారి తనిఖీ చేస్తున్నారు. సర్వే టీంలో మండలానికి ఒక ఆర్డీవోతోపాటు తహసీల్దార్, ఎంపీడీవో, ఆర్ఐ, సీనియర్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్తోపాటు పంచాయతీ సెక్రటరీని కూడా ఉంచారు. ముంపులో ఉన్న ప్రతి బాధితుడి పేరు రిజిష్టర్లో నమోదు చేయాల్సిందేనని ఆదేశాలు రావడంతో ప్రతి కుటుంబాన్ని పరిగణలోకి తీసుకుంటున్నారు.
సేవలందిస్తూ.. సౌకర్యాలు కల్పిస్తూ..
ముంపులో ఉన్న ప్రతి కుటుంబానికి ప్రభుత్వ యంత్రాంగం ఆసరాగా నిలుస్తున్నది. సాయం మాకు అందలేదు అనే మాట రాకుం డా ఇంటింటికీ వెళ్లి సాయమందిస్తున్నారు. రెండు జిల్లాల కలెక్టర్లు, పంచాయతీరాజ్ కమిషనర్ హనుమంతరావు భద్రాచలంలో మకాం వేసి ముంపు బాధితులకు అండగా నిలుస్తున్నారు. పారిశుధ్యం అంటే ఇలా ఉండాలి అని పంచాయతీ సిబ్బందితో జల్లెడ పట్టించారు. ఎక్కడా.. ఏ రోడ్డు మీద మురుగు నీరు ఆగకుండా, బురదమయం లేకుండా పకడ్బందీగా చర్యలు చేపడుతున్నారు. రెండు జిల్లాల్లో ఉన్న పంచాయతీ సిబ్బందిని ముంపు ప్రాంతాల్లో ఉంచి సేవలు అందిస్తున్నారు. సీఎం కేసీఆర్ ప్రకటించిన రూ.10 వేలు సాయం ప్రతి కుటుంబానికి అందేలా ఇంటింటి సర్వే చేపట్టారు. పంచాయతీ కార్యదర్శులు వారంరోజులు నుంచి ముంపు ప్రాంతాల్లో మకాం వేసి బాధితులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నారు. వైద్యసిబ్బంది, అంగన్వాడీ టీచర్, పంచాయతీ సిబ్బంది టీంలుగా వెళ్లి ఇంటింటి సర్వే చేపట్టారు. ఎవరికి ఎలాంటి సమస్యలు ఉన్నాయి, వ్యాధులు ఉన్నాయి.. సరుకులు అందుతున్నాయా.. ముంపులో ఎలాంటి నష్టం జరిగింది.. అని పూర్తిస్థాయిలో సర్వే చేస్తున్నారు.
మేమున్నాం అంటూ భరోసా
ఒకరు కాదు.. ఇద్దరు కాదు ఏకంగా 8మంది ఉన్నతాధికారులు ముంపు ప్రాంతాల్లో సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. వైద్యం అంటే నేనున్నానని హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస్రావు, పారిశుధ్యం అంటే దాని అడ్రస్ కనబడకూడదు అని పంచాయతీరాజ్ కమిషనర్ హనుమంతరావు, రక్షణ చర్యలకు నేనున్నానని ఎస్పీ వినీత్, ఏఎస్పీ రోహిత్రాజ్, వరద బాధితులకు ఎక్కడా లోటులేకుండా ధైర్యంగా ఉండాలని అండగా ఉన్నాం అంటూ ముగ్గురు ఐఏఎస్లు, అన్నీ సవ్యంగా జరుగుతున్నాయా అనేది చూసేందుకు సీనియర్ ఐఏఎస్లు ఇద్దరు ఉండి వరద ముంపులో ఎక్కడా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా తమ వంతు కృషి చేస్తూ ప్రజల మన్ననలు పొందుతున్నారు.
పడవ ప్రయాణంలో కలెక్టర్
వరద తగ్గినా ఇంకా ముంపులో ఉన్న కొన్ని గ్రామాల్లో కలెక్టర్లే స్వయంగా వెళ్లి సహాయక చర్యలపై ఆరా తీస్తున్నారు. దుమ్ముగూడెం మండలం సున్నంబట్టి గ్రామంలో ఇంకా వరద ఉండడంతో అక్కడికి పడవపై కలెక్టర్ వెళ్లి బాధితులను పరామర్శించారు. వారంరోజులతోపాటు అధికారులు ఎలాంటి సౌకర్యాలు అందించారు అని అడిగి తెలుసుకున్నారు. వరద ఇప్పుడే తగ్గినట్టు కాదు నెల అంతా వర్షాకాలం ఉంది జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. మళ్లీ వరద వచ్చినా ఇబ్బంది లేకుండా అండగా ఉంటామని భరోసా ఇస్తున్నారు. భద్రాచలంలోని కొత్తకాలనీ, అశోక్నగర్, సుభాష్నగర్ కాలనీల్లో గురువారం కలెక్టర్ పర్యటించి కుటుంబాల గణన ప్రక్రియను పరిశీలించారు. పరిస్థితులు సాధారణ స్థాయికి వచ్చేవరకు ఫ్లడ్ షెల్టర్స్లోనే ఉండాలని సూచించారు. వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలన్నారు. సురక్షితమైన తాగునీరు మాత్రమే తీసుకోవాలన్నారు. ప్రతి ఒక్కరికీ సాయం అందుతుందని ఎలాంటి ఇబ్బందులు ఉండవని అన్నారు.
హెలికాప్టర్ ద్వారా..
దారిలేని గ్రామాల్లో హెలికాప్టర్ ద్వారా సహాయక చర్యలు ముమ్మరంగా చేపడుతున్నారు. భద్రాచలం ఏజెన్సీ ప్రాంతంలో ఇప్పటికీ ముంపులోనే ఉన్న చర్ల, దుమ్ముగూడెం లోతట్టు ప్రాంతాలకు రహదారి లేనందున నిత్యావసర సరుకులు హెలికాప్టర్ ద్వారా సరఫరా చేస్తున్నారు. గత ఐదురోజులుగా అదే ప్రాంతంలో ఐఏఎఫ్ చేతక్ హెలికాప్టర్ విస్తృతంగా సేవలు అందించింది. వరదలు వచ్చిన తరుణంలో ముందుగానే ప్రభుత్వం హెలికాప్టర్ను అందుబాటులో ఉంచుకుని సరుకులు పంపిణీని వేగవంతం చేసింది. చర్ల మండలానికి 470, దుమ్ముగూడెం మండలానికి 670 కిలోల సరుకులను అందజేశారు. మొత్తం మీద ఐదురోజులుగా అన్ని గ్రామాల్లో 20 సార్లు తిరిగి 1,930 కిలోల సరుకులను చేరవేసింది. దీంతో ముంపు గ్రామాలకు వేగవంతంగా సహాయక చర్యలు జరిగాయి.
పకడ్బందీగా పారిశుధ్య పనులు
వరద వచ్చిందంటే చాలు ఎక్కడాలేని దోమలు ఇళ్లను చుట్టుముడతాయి. కానీ ఇప్పుడు ఒక్క దోమలేకుండా వైద్యశాఖ, పంచాయతీరాజ్శాఖ పకడ్బందీ చర్యలు తీసుకున్నది. అసలు మురికి లేకుండా చేసి పాకింగ్ మిషన్ ద్వారా పగలు రాత్రులు జట్ స్పీడ్తో పనులు చేపడుతున్నారు. వ్యాధులు రాకుండా పునరావాస కేంద్రాలతోపాటు, గ్రామాల్లో వైద్యశిబిరాలను ఏర్పాటు చేశారు.