భద్రాచలం, జూలై 12: ముంపు బాధితులకు పునరావాస కేంద్రాల్లో అన్ని సౌకర్యాలూ కల్పించామని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ అన్నారు. వరద ముంపు ప్రాంతాల ప్రజలందరూ ధైర్యంగా ఉండాలని సూచించారు. ప్రభుత్వం, అధికార యంత్రాంగం మరింత అప్రమత్తంగా ఉన్నాయని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు. సోమవారం రాత్రి సారపాక ఐటీసీ అతిథిగృహంలో బస చేసిన ఆయన.. మంగళవారం ఉదయం భద్రాచలం వచ్చి ముంపునకు గురైన కొత్తకాలనీ వాసులతో మాట్లాడారు. పునరావాస కేంద్రాల్లోని బాధితులకు బ్రెడ్లు, పండ్లు పంపిణీ చేసి ధైర్యం చెప్పారు. సౌకర్యాల కల్పన గురించి బాధితులను అడిగి తెలుసుకొని సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం గోదావరి వంతెనను, కరకట్ట వద్ద నదీ ప్రహహాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గోదావరి వరద పరిస్థితి గురించి సీఎం కేసీఆర్కు నివేదించామన్నారు.
ఎడతెరపి లేని వర్షాల కారణంగా గోదావరి ప్రవాహం ప్రమాద స్థాయికి చేరుకున్నా.. మంగళవారం ఉదయం నాటికి తగ్గుముఖం పట్టిందని అన్నారు. సోమవారం సాయంత్రం మూడో ప్రమాద హెచ్చరికను జారీ చేయగా.. మంగళవారం ఉదయం వరద ఉధృతి 53 అడుగుల నుంచి తగ్గడంతో దానిని ఉపసంహరించామని చెప్పారు. సీఎం కేసీఆర్ సూచనల మేరకు సోమవారం రాత్రి ఇక్కడే బస చేసిన తాను.. జిల్లా యంత్రాంగాన్ని అప్రమత్తం చేస్తూనే పరిస్థితులను ఎప్పకప్పుడు సీఎంకు ఫోన్ ద్వారా వివరిస్తున్నట్లు చెప్పారు. రానున్న రెండు రోజులూ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతున్నందున అధికారులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సీఎం కూడా ఎప్పటికప్పుడు ఫోన్ చేసి భద్రాచలం వరద పరిస్థితులపై వాకబు చేస్తున్నారని అన్నారు. జడ్పీ చైర్మన్ కోరం కనకయ్య, కలెక్టర్ అనుదీప్, ఎస్పీ వినీత్, అదనపు కలెక్టర్ కర్నాటి వెంకటేశ్వర్లు, మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, జిల్లా గ్రంథాలయం సంస్థ చైర్మన్ దిండిగల రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.
ప్రభుత్వం అండగా ఉంది..
వరద బాధితులకు ప్రభుత్వం అండగా ఉందని, అన్ని విధాలా ఆదుకుంటుందని మంత్రి అజయ్కుమార్ అన్నారు. ఆర్అండ్బీ గెస్ట్ హౌస్లోని పునరావాస కేంద్రంలో ఉన్న ముంపు బాధితులతో మంగళవారం ఆయన మాట్లాడారు. టీఆర్ఎస్ నాయకులు డాక్టర్ తెల్లం వెంకట్రావు, అరికెల్ల తిరుపతిరావు, కొండిశెట్టి కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు.