మణుగూరు రూరల్, జూలై 8: గురువారం అర్థరాత్రి నుంచి శుక్రవారం మధ్యాహ్నం వరకు ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షంతో జనజీవనం స్తంభించిపోయింది. లోతట్టు ప్రాంతాలకు వరద నీరు చేరడంతో పాటు కాల్వలు, వాగులు పొంగిపోర్లాయి. సమితిసింగారం పంచాయతీలోని కోడిపుంజుల వాగు రోడ్డుపై ప్రవహిస్తుండడంతో రాకపోకలు నిలిపివేశారు.
బొగ్గు ఉత్పత్తిపై తీవ్ర ప్రభావం..
మణుగూరు ఏరియాలో నాలుగు రోజుల నుం చి కురుస్తున్న వర్షాలకు రోజూ 30వేల టన్నుల బొగ్గు ఉత్పత్తి కావాల్సి ఉండగా, ప్రతిరోజూ 15వేల టన్నుల బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. వోబీ ప్రతి రోజూ 50వేల క్యూబిక్ మీటర్ల వెలికితీయాల్సి ఉండగా, సగటున 17వేల టన్నులు వెలికితీసినట్లు అధికారులు పేర్కొన్నారు.
బూర్గంపహాడ్లో..
బూర్గంపహాడ్, జూలై 8: మండల వ్యాప్తంగా వర్షం విస్తారంగా కురవడంతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. పాల్వంచ మండలం దంతెలబారుకు చెందిన బోదా నర్సిరెడ్డి వ్యవసాయ పనుల నిమిత్తం సోంపల్లి వచ్చి తిరిగి వెళ్తున్న క్రమంలో కిన్నెరసానిలో గేట్లు ఎత్తడంతో నీటిలో చిక్కుకున్నాడు. తహసీల్దార్ భగవాన్రెడ్డి నేతృత్వంలో సిబ్బంది అక్కడకు చేరుకుని కిన్నెరసాని అధికారులతో మాట్లాడి గేట్లు మూ యించి మూడు గంటల తర్వాత ఒడ్డుకు చేర్చారు.
పినపాకలో..
పినపాక, జూలై 8: ఎడతెరిపి లేకుండా కురిసిన జోరు వానతో చెరువులు, కుంటల్లోకి భారీగా వరదనీరు వచ్చి చేరింది. లోతట్టు ప్రాంతాలన్ని జలమయమయ్యాయి. మండలంలో 17.4 వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు.
సారపాకలో..
సారపాక, జూలై 8: ఎడతెరిపిలేకుండా వర్షం కురవడంతో ఇరవెండి నుంచి అశ్వాపురం వైపు వచ్చి పోయే వాహనాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఇరవెండి గ్రామశివారులో సర్పంచ్ కొర్సా లక్ష్మి, మాజీ ఎంపీటీసీ వల్లూరిపల్లి వంశీకృష్ణ ట్రాక్టర్ను అడ్డుగా పెట్టి రాకపోకలను నిలిపివేశారు.
ఆళ్లపల్లిలో..
ఆళ్లపల్లి, జూలై 8. కురిసిన జొరు వాన కురిసింది. జోరు వానకు కిన్నెరసాని, జల్లేరు, కోడెల, తునికిదొన్నె వాగులు , వంకలు పొంగిపొర్లాయి. సంపత్నగర్ వద్ద రహదారి కొతకు గురైంది.
కరకగూడెంలో..
కరకగూడెం, జూలై 8: మండల వ్యాప్తంగా ఎడతెరిపిలేని వర్షం కురుస్తూనే ఉంది. మోతె- తాటిగూడెం గ్రామాల మధ్య రహదారి పక్కన వృక్షం పడిపోవడంతో ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు.
అశ్వాపురంలో..
అశ్వాపురం, జూలై 8: కురుస్తున్న వర్షానికి తు మ్మలచెరువు శుక్రవారం పూర్తి గరిష్ట నీటి సామర్థ్యమైన 23.6 అడుగులకు చేరుకుంది. పూర్తిస్థాయిలో నిండిన తుమ్మల చెరువును సర్పంచ్ మర్రి మల్లారెడ్డి, తహసీల్దార్ సురేశ్కుమార్ పరిశీలించారు.
చర్లలో..
చర్ల, జూలై 8: కురుస్తున్న వర్షాలకు మండలంలోని తాలిపేరు, కొండవాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. అధికారులు తాలిపేరుకు ప్రాజెక్టు 20 గేట్లు ఎత్తి 12 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు.
దుమ్ముగూడెంలో..
దుమ్ముగూడెం, జూలై 8: మండలవ్యాప్తంగా కురుస్తున్న వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయంగా మారాయి. శుక్రవారం మండలంలో 35.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.