భద్రాద్రి కొత్తగూడెం, జూలై 8 (నమసే ్తతెలంగాణ): సమాజంలో మార్పు రావాలాంటే చదువు చాలా ముఖ్యమని, అందుకని తెలంగాణ ప్రభుత్వం విద్యకు అధిక ప్రాధాన్యం ఇస్తోందని రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్, రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ పేర్కొన్నారు. కొత్తగూడెం మున్సిపాలిటీ పరిధిలోని రామవరంలో రూ.12 కోట్లతో నిర్మించిన ఏకలవ్య మోడల్ స్కూల్ను ప్రభుత్వ విప్ రేగా కాంతారావు, జడ్పీ చైర్మన్ కోరం కనకయ్య, ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావుతో కలిసి శుక్రవారం వారు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ గిరిజన సంక్షేమానికి టీఆర్ఎస్ సర్కారుకు పెద్దపీట వేస్తోందని అన్నారు. గతంలో 90 గురుకులాలు ఉంటే ఇప్పుడు 183 గురుకులాలు ఉన్నాయని అన్నారు. పదో తరగతి చదువుకొని ఇతర ప్రాంతాలకు వెళ్లకుండా వాటిలోనే జూనియర్ కాలేజీలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. అంబేద్కర్ విదేశీ విద్యనిధి పథకంలో భాగంగా విదేశీ విద్యను ప్రోత్సహించి ఇతర దేశాల్లో చదువుకునే అవకాశాలను ప్రభుత్వం కల్పిస్తోందని అన్నారు. ఈ ఏకలవ్య పాఠశాలలో అన్ని సౌకర్యాలు కల్పిస్తామమన్నారు. రోడ్డు, క్రీడా సామగ్రి కోసం రూ.కోటి నిధులు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. మంచిగా చదువుకొని ఉన్నత విద్యను అభ్యసించాలని విద్యార్థులకు సూచించారు.
నూతన కలెక్టరేట్ పరిశీలన..
జిల్లా కేంద్రం సమీపంలోని కేఎస్ఎం వద్ద నూతన కలెక్టరేట్ భవన నిర్మాణ పనులను మంత్రులు పరిశీలించారు. త్వరలో కలెక్టరేట్ ప్రారంభం కాబోతోందని అన్నారు. పూర్తయిన పనుల గురించి కలెక్టర్ అనుదీప్ను అడిగి తెలుసుకున్నారు. ఐటీడీఏ పీవో గౌతమ్, ఆర్అండ్బీ ఈఈ బీమ్లా, మున్సిపల్ చైర్పర్స్న్ కాపు సీతాలక్ష్మి, ఆర్సీవో డేవిడ్రాజు, డీడీ రమాదేవి, తహసీల్దార్లు, ఎంపీడీవోలు, కౌన్సిలర్లు పాల్గొన్నారు.